Wednesday, 29 October 2014

మౌంట్ విసూవియస్

Posted by Kumar N on 10/29/2014 10:37:00 am with No comments
మౌంట్ విసూవియస్...

ఇదొక వోల్కానో. మునుముందు ఎరప్ట్ అవబోయేదిగా పరిగణించబడే ఒక యాక్టివ్ వోల్కానో.

రోమ్ కి సమీపదూరంలో పాంపే, హెర్కులేనియం నగరాలని  సమూలంగా నేలమట్టం చేసి, ఆ నగర పౌరులని సజీవసమాధి చేసిన అగ్నిపర్వతంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది సుపరిచితం.

79AD సంవత్సరంలో హిరోషిమా, నాగసాకి బాంబ్స్ కన్న ఒక లక్షరెట్ల ఎక్కువ వేడితో ఈ పర్వతం లావానీ, యాష్ నీ, మౌంటెన్ రాక్స్ నీ ఎగచిమ్మి ఆకాశాన్నంటి, అటుపై పక్కనున్న పాంపేని ఇరవై అడుగుల లోహపొడిలో ముంచెత్తింది. అప్పుడు పైకెగసి న మోల్టెన్ రాక్ మెటీరియల్ , యాష్ తో కలిసి అతి సన్నటి బూడిదలా తయారయిన ఆ పదార్థం అత్యంత వేడితో భూమ్మీదకొచ్చి, చుట్టూ ఎన్నో మైళ్లకి వ్యాపించింది. ఆ వేడి తగలగానే మనుషులు ఎలా ఉన్నవారలానే అదే క్షణం లో చనిపోయారు. కాని విచిత్రంగా వాళ్లని కమ్మేసిన అతి సన్నటి బూడిద వెంటనే గట్టిపడింది. లోపల ఉన్న శరీరాలు శతాబ్ధాల కాలంలో క్షీణించి నశించి పోయాయి, కాని పైన గట్టిపడిన బూడిద ఆ శరీరాపుకాటారాన్నీ అలాగే ఉంచుకుంది. దాదాపు పదిహేను వందల సంవత్సరాలు కాలగర్భంలోనూ, బూడిదలోనూ మునిగిపోయిన ఈ పాంపే నగరాన్ని 1599 లో మొదటిసారిగా, 1748 లో మరింత విస్తృతంగా ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ఆ బూడిద కింద ఉన్న మనుషుల ఆకారాలూ, వస్తువులూ ఏ రకమయిన గాలీ, తేమా జొరపడక భద్రంగా ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు ప్లాస్టర్ ని ఆ కావిటీస్ లోకి ఇంజక్ట్ చేసి, కొంతమంది శరీరాల మీద ఉన్న వస్త్రధారణ గుర్తులతో సహా మనుషుల చనిపోయిన క్షణంలోని ఆకారాలని రిట్రీవ్ చేయగలిగారు. అలా ప్రాచుర్యం లోకి వచ్చిన పాంపే గత 250 సంవత్సరాలుగా  సందర్శకులని ఆకర్షిస్తూనే ఉంది. పాంపే మీద ఎత్తైన పడగలా నించుని ఉన్న ఈ మౌంట్ విసువియస్ ని ఈ రోజుకి కూడా ప్రమాదకరమయినదిగా వోల్కానాలజిస్టులు పేర్కొంటారు.

గత వంద సంవత్సరాల కాలంలో యూరప్ లో ఎరప్ట్ అయిన ఒకే ఒక్క అగ్నిపర్వతం ఇది. ఇటలీకి వెస్ట్ కోస్ట్ లో, నేపుల్స్ నగరానికి 4,000 అడుగుల పైన యూరప్ లో ఈరోజు అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదకరమయిన అగ్నిపర్వతంగా పరిగణించబడుతూ, ప్రపంచంలో మిగతా అగ్నిపర్వతాల కన్నా ఎంతో క్లోజ్ గా మానిటర్ చేయబడుతున్న యాక్టివ్ వోల్కానో ఇది. కొన్ని డజన్ల సెన్సర్స్  దాని టేంపరేచర్, అది వదుల్తున్న వాయువుల డేటాని, ఇరవైనాలుగు గంటలూ కింద ఉన్న నేపుల్స్ నగరం లోని మౌంట్ విసీవుయస్ అబ్జర్వేటరీకి పంపిస్తుంటాయి. యూరోపియన్ సాటిలైట్ ఒకటి దీన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. కనీసం ఇద్దరు సైంటిస్టులు ఈ డేటాని రోజంతా గమనిస్తుంటారు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో ఎక్కడైనా తేడా వస్తుందేమో అని డేటాని, కేబుల్, టేలిఫోన్, రేడియోల ద్వారా కూడా పంపుతూ  ఉంటారు.

రీసెంట్ గా 1944 లో జరిగిన ఎరప్షన్ లో లావా 11 రోజుల పాటు విరజిమ్మి కొంతమంది ప్రాణాలు హరించి వేలమందిని నిరాశ్రయుల్ని చేసింది.  అందుకే ఈ సారి జరగబోయే(!) ఎరప్షన్ కి ఆ ప్రాంతం చుట్టూ ఉండే నగరాలు/గ్రామాల్లోని ఆరు లక్షల పౌరులు నివసించే ప్రాంతాల్ని రెడ్ జోన్ కింద డిక్లేర్ చేసి, అంతమందినీ ఎవాక్యుయేట్ చేసే ప్లాన్స్ ని సిద్దంగా పెట్టుకుంది. మరి అన్ని లక్షల మందిని ముందే ఎవాక్యుయేట్ చేయాలంటే, కనీసం రెండు వారాలయినా పడుతుందనీ, కాబట్టి ఆ రెండు వారాల ముందే ఎరప్షన్ ని ప్రిడిక్ట్ చేయగలిగే డేటా గాదరింగ్ నీ, అందర్నీ సురక్షిత ప్రాంతాలకి ముందే తరలించే సాంకేతిక నైపుణ్యత ని కూడా ఇటలీ ప్రభుత్వం సమకూర్చుకుని సన్నద్ధంగా ఉంది అని చెపుతారు.

ఈ పర్వతం కిందే ఉన్న పాంపే పట్టణానికి అతి సమీపం లో ఉండేది నేపుల్స్ అనే పెద్ద నగరం.  రేవు పట్టణంగా దాదాపు 2,000 ఏళ్ల క్రితం , నిరంతర ప్రయాణీకులతో, వర్తకంతో, రోమన్ కాలానికి వైభవంగా గడిపిన పాంపే లో ఈ రోజుకీ, ఆనాడు పరచిన రోడ్లు, మెట్లూ, పక్కాగా ప్లాన్ చేసి నిర్మించబడ్డ డ్రైనేజ్ సిస్టమ్స్, ప్రధాన రహాదారీ, కూడలి, మార్కెట్ ప్లేస్, తినుబండారాలు వండి సర్వ్ చేసే ప్లేసేస్, ఆడిటోరియం, మెన్, వుమెన్ కి సెపరేట్ గా లెడ్ పైప్స్ లో హాట్ వాటర్ తో స్పా లాంటి సౌకర్యాలూ, ఎక్సర్ సైజెస్ రూములూ, వర్తకప్రయాణికులు మజిలీలో ఆగినప్పుడు వారి కోసం సెక్స్ సర్వీసెస్ అందించే అమ్మాయిల గృహాలు వాటిల్లో వాత్సాయన భంగిమల చిత్రాల మొజాయిక్ పలకలూ, గ్రీక్ , రోమన్ గాడ్స్ అపొలో టెంపుల్ ఇలాంటివన్నీ ఇప్ప్పటికీ చూడవచ్చు.

పాంపేని చూడాలని షుమారుగా 25 మిలియన్స్ విజిటర్స్ వస్తూంటారు ప్రతి సంవత్సరం. ఇటలీకి వెళ్తూ ప్రిపేర్ చేసుకున్న ఇటినరీ లో పాంపే కూడా పెట్టుకున్నాం కానీ, ఆ మౌంట్ వుసీవుయస్ పైకి వెళ్లాలా వద్దా అన్నది అక్కడికి వెళ్లాక చూడొచ్చులే అనుకున్నాం. రోమ్ నుంచి నేఫుల్స్ కి గంటకి మూడు వందల కిలోమీటర్ల స్ఫీడ్ టచ్ చేసిన హై స్పీడ్ ట్రెయిన్ లో వెళ్లి, అక్కణ్నుంచి మన ముంభై, చెన్నై లోకల్ ట్రెయిన్స్ బెటర్ అనిపించేలా నిలువెత్తు గ్రాఫిటీతో మునిగి ఉండి నాకు ఆశ్చర్యాన్నీ, చిరాకునీ పుట్టించి ఉండే  లోకల్ ట్రెయిన్స్ లో నేపుల్స్ నుంచి పాంపే కి ఒక అరగంట-నలభై నిమిషాలు ట్రావెల్ చేసి పాంపేలో దిగి, పాంపే విజిట్ అయిపోగుట్టుకున్నాక.. ఇంకా టైం ఉండటంతో మైదానంలో నిలపడి తల పైకెత్తి దూరంగా చూట్టం మొదలెట్టాను.

అసలు పాంపే కి విజిటర్స్ ని  రప్పించటానికి మూలకారణమయిన మౌంట్ విసీవుయస్ కేసి దీర్ఘంగా చూస్తూంటే, అసలు నాకే పాపమూ తెలీదు, చూడు నేను ఎంత అందంగా, ఠీవీగా నించుని ఉన్నానో అన్నట్లుగా కనిపించింది నాకు. అసలే బ్యూటిఫుల్ డే విత్ క్లియర్ స్కైస్... మంచి వెదర్.. భూమి పుట్టినప్పట్నుంచీ నేనిక్కడే ఉన్నాను ప్రశాంతంగా, కావలిస్తే ఇన్నాళ్లూ నాతో ఉన్న ఈ Naples Bay లో అత్యంత అందంగా కనపడే ఈ నీళ్లనీ, బకెట్ లిస్ట్ అని మీ మానవులు పెట్టుకునే పట్టికలో ఉండే ఈ నేపుల్స్ బే ప్రాంతాన్నీ అడుగు అని నాతో మాట్ళాడినట్లు అనిపించింది.

ఓహో అవునా, సరే అయితే నువ్వేంటో , నీ అమాయకత్వం ఏంటో, నీ పైనుంచి ఆ సుందరమయిన నేపుల్స్ నగరాన్నీ, దాన్ని చుట్టేసిన ఆ స్వచ్చమయిన నీలిరంగు నీళ్లనీ నా కళ్లతో చెక్ చేసుకుంటాను వస్తున్నానుండు అని సిద్దమయ్యాను.

పైన మంటలూ, యమలోకంలోలా సలసల కాగుతున్న లోహామిశ్రమాలూ,
మీది మీదికి ఎగసిపడే నిప్పు రవ్వలూ అలాంటి సీన్స్ ఏం లేవక్కడ :)) హ హ అలా ఉండవని తెలుసులెండి కానీ జస్ట్ ఇన్ కేస్ మనం పైకి వెళ్లగానే కాస్త యాక్టివిటీ ఊపందుకొని ఉంటే ఎలా ఉంటుందా అని :)))) ఎనీవే  అక్కడంత సీన్ ఏం లేదు, ఓ పేద్ద క్రేటర్.. దాంట్లోంచి ఆ సల్ఫర్ వాసన మాత్రం తెలుస్తోంది బానే. కొన్ని సార్లు చాలా పంజెంట్ గా వస్తాయట.. అపుడు కళ్లు కూడా మండుతాయని చెప్పారక్కడి వాళ్లు.

కిందంతా వేడిగా సమ్మర్ డే కదా, పర్లేదులే అనుకున్నాను పైన చల్లగా ఉంటుందని తెలిసి కూడా... కానీ బాబోయ్.. చలి బాగా ఉంది అక్కడ.. అస్సలు చలికి ప్రిపేర్డ్ గా వెళ్లలేదు మేం. తప్పనిసరిగా థిక్ స్వేట్టర్, తలకీ, ఎట్ లీస్ట్ చెవులకి ప్రొటెక్టివ్ వేర్ తీసుకెళ్లటం బెటర్. కాకపోతే ఉండేది కొద్ది సేపు కాబట్టి పర్లేదు కాని , ఇదో ఇలా ఈ గైడ్ లాగా చాలా సేపు ఉండాల్సి వస్తే పేలుద్ది ఫ్రీజింగ్ వెదర్. హాట్ సమ్మర్ లోనే అలా ఉంటే  చల్లగా ఉండే సెప్టెంబర్, అక్టోబర్, మార్చి ల్లో ఎలా వెళ్తారో ఏమో విజిటర్స్ అనుకున్నాను.


Wednesday, 8 October 2014

తను తిరిగిన దారుల్లో

Posted by Kumar N on 10/08/2014 03:28:00 am with 2 comments



"సుదూరం లోకి సాగిపోయ్యే రైలు పట్టాల మీద మధ్యాహ్నపు వేళల ఎండ గీసిన వెండి అంచు గీతలూ, దడదడలాడే బోగీల చప్పుళ్లూ, ఇంజన్ కూతలూ, గాల్లోకి అలముకునే పొగా, ఇనపతలపుల వాసనా......................, "

అంతే , ఆ ఇనపకిటికీల వాసన ఎంత బలంగా ముక్కుని తాకిందంటే, 

ఏ వాసనా లేని, చుట్టూ కళ్ళకింపు రంగులతో నింపబడి, ఖరీదైన కలర్ కాంబినేషన్ల దుస్తుల్లోని అందమైన మనుషులు 'నేనే' ముఖ్యం వాళ్లకి అన్నట్లుగా నవ్వుతూ పలకరించే వాతావరణం మధ్య కూర్చుని, కొద్ది నిమిషాలల్లో బరువు తేలికయ్యి, గాల్లోకి తేలిపోయి ఆ సుఖంతో మత్తుగా నిద్రలోకి జారిపోయే అలవాటయిన అనుభవం కోసం సిద్దమవుతున్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఉన్నపళాన బయటపడి, ఆ మధ్యాహ్నపు వేడి పొగ అంచు అంటిన గాలిని పీలుస్తూ, ఆ రైలు కిటికీ పక్కన కూర్చొని ఆ ఇనప వాసనని గుండెల్నిండా బలంగా పీల్చాలని ఎంతగా అనిపించిందో!!

చదువుతున్నది ఆపేసి, కళ్లు మూసుకొని warp drive చేసి తండ్లాడాను ఆ వాసన కోసం. ఒక వాసన కూడా అస్థిత్వ రూపకల్పనలో ఒక చిన్న భాగమవుతుందని ఇది రాస్తూంటే తెలిసొస్తోంది.

హబ్బ, ఎప్పటి రైలు ప్రయాణాలూ!!, తరచుగా ఊర్నించి గంటల కొద్దీ ఆ పొగబండిలో. ఎండంతా మనిషి మీద నుంచే..కిటికీ ఊచలకి వీలయినంత వరకీ తలని బయటకి నొక్కి పెట్టి, గడ్డం కింద చేయి పెట్టుకొని, ఆ 'ఎండ గీసిన వెండి అంచు గీతల' వెంట కళ్లు సారించి, బోగీ ఊగినప్పుడల్లా, ఆ వెండి అంచు తళతళ కదలికల్లో సూర్యుడి ప్రతిబింబం కోసం వెతుక్కోవటమో, లేదంటే కళ్లు కిందకి వంచి ఆ వెండి అంచు వెంట వేగంగా వెళ్లి, పట్టాల మీద సూర్యుణ్ణి తదేకంగా చూట్టమో, ఎన్నిసార్లని!!

వెళ్ళేదిశకి వీపు పెట్టి కూర్చుంటే ధూళి కణాలు కళ్లల్లో పట్టం తప్పించుకోవచ్చనీ, అప్పుడప్పుడూ గప్పున వదిలే పొగ వళ్లంతా కప్పేయకుండా కాపాడుకోవచ్చనీ మెదడు చెప్పినా వినకుండా, పోట్లాడి ముందుగా ఒక పుస్తకమో, మరోటేదో విసిరేసి 'ఆ' కిటికీ పక్క సీట్లోకి తోసుకుంటూ వెళ్ళి , కాస్త వేగమందుకున్నాక ఆ ఎదురు గాలి కోసం తల ఏటవాలుగా పైకెత్తి కళ్లు మూసుకొని , ఇంకాసేపయ్యాక దగ్గర్లో వరసగా వస్తూన్న చెట్లకింది "ఊదారంగు నీడల"లోకి వెళ్లిపోయిన నాతో నేనే దోబూచులాడుకుంటూ చేసిన ప్రయాణాలు! 

ఎవరీయన?!! 

***

చీకటిలోంచి, కళ్లు చిట్లించే వెలుతురులోపలకి వచ్చి సెక్యూరిటీ క్లియర్ చేసి, గేట్ దగ్గరికి నడుస్తున్నా.

"ఎక్కడున్నారు, ఎయిర్ పోర్ట్? " అంటూ ఈమెయిల్.

"అవును, ఏం" 

" మీ ఫోన్ లో పిడిఎఫ్ ఓపెన్ అవుతుందా? "

" అవుతుంది "

"మొన్నొక పుస్తకం పంపాను, గుర్తుందా, అసలా ఈమెయిల్ ఉందా, డిలీట్ చేసారా :) సరేలే ఎందుకు వెతుకుతారు కానీ, అటాచ్మెంట్ పంపాను దీనితో, ముందిది ఓపెన్ చేయండి"

"యా, ఈమెయిల్ ఎందుకు డిలీట్ చేస్తానూ? ఉంది ఆ పుస్తకం, ఇంకా చూడలేదు, వీకెండ్ కదా కుదర్లేదు. సరే చూస్తాను "

"చూస్తాను కాదు, ఇప్పుడు ఓపెన్ చేయండి" కరుణ నిండిన సాధికార స్వరం.

దేవుడా, ఈ అమ్మాయి నీ చేతుల్లో తయారయ్యక, ఈ భూమ్మీదకి వదిలేముందు, నువ్వు నీ సృష్టి గురించి ఏం అనుకున్నావో ఒకసారి తెలుసుకోవాలనుంది స్వామీ.

"ఇప్పుడే ఫ్లైట్ లోపలకి సీట్ళోకి వచ్చి కూర్చున్నా, కొద్ది సేపట్లో నిద్రపోతాను, తరువాత తప్పనిసరిగా చదువుతాను ఓకేనా" 

"కుదర్దు, ఇప్పుడే ఓపెన్ చేసి డైరక్టుగా పేజ్ నం. 67 కి వెళ్లిపోండి . [అంతకుముందు మెయిల్ లో పంపిన పుస్తకాల గతేమయిందో నాకు తెలుసు]"

ఈ పిల్లతో వల్ల కాదబ్బా. అమ్మ చూపించే అధికారమే అంతా.

***

అప్పుడు తెరిచాను. ముందు పేజీలలో రచయిత చెప్పిందేంటో వినకుండా నేరుగా 67 కి పోవటం ఇష్టం లేక,

మొదటి పేజీలో మొదట్లోనే..

"......... ఇనపతలపుల వాసనా, వెనక్కి సాగిపోయే గ్రామాలూ, అక్కడక్కడ ఏ తుమ్మచెట్టుకిందనో పరచుకునే ఊదారంగు నీడలు గుర్తొస్తాయి......... మరీ పసితనంలోనే ఇల్లువదలి ఎక్కడో ఒక దూరపు పాఠశాలకు పోవలసి వచ్చిన బాల్యంలో, ఒక బస్సు కిటికీనో లేదా రైలుకిటికీనో ఆశ్రయించి ఏ పంటపొలాల మీద తూనీగ గానో, ఏ మబ్బుదారుల్లో మెరుపుగానో నా మనసుని పోనిచ్చే వాణ్ణి. ఏవేవో కలలు కంటూండే వాణ్ణి. "

నేను కదా ?! 

అసలెవరితను? ఇంతకీ పుస్తకం వచ్చినప్పుడు ఈమెయిల్ లో ఏదో రాసినట్లు గుర్తు, లెట్ మీ సీ.

"ఇది మీరు తప్పక చదవాల్సిన పుస్తకం . ఈయన స్టైల్ గురించి నేను సర్టిఫై చేయక్కర్లేదు మీకు బాగా తెలిసే ఉంటుంది . అసలు అరకు , శ్రీశైలం గురించిన వర్ణన ఆసలు నేను ఎంత మైమరచి చదివానో . బ్యూటిఫుల్ . ఇహ ఇంగ్లాండ్ గురించి అయితే మాత్రం మీకు చాలా చాలా ఇంటరెస్టింగ్ ఉంటుంది . తెలుగులో కూడా ఇంత మంచి travelogues ఉన్నాయని తెలీదు నాకు. అసలు ట్రావెలాగ్ రాసే ప్రతి ఒక్కరు ఒకసారి అవి ఎలా రాయాలో ఇది చదివి అప్పుడు రాస్తే బావుండు . నేను ఓవర్ హైప్ చేయటం ఇష్టం లేదు కానీ, గత కొద్ది కాలంలో నాకు చాలా నచ్చిన బుక్ ఇది. of course, నా టేస్ట్ అంత గొప్పది కాదు కానీ ఆయన లాంగ్వేజ్, రాసిన విశేషాలూ, అబ్జర్వేషన్స్, మనుషుల మీది ప్రేమా అండ్ వాట్ నాట్?!! He mesmerized me! ............"

నో, నాకు ఈయన గురించి తెలీదు, బ్లాగ్ ప్రపంచంలో ఎక్కడో రెండు సార్లు ప్రస్తావన చూసి ఉంటానేమో. గమ్మత్తైన పేరు.

నేరుగా ఆ 67 వ పేజీకే పోయాను.

"...మరీ ముఖ్యంగా, చారిత్రక స్థలాలు చూడటమంటే, నాకెక్కడ లేని ఉత్సాహం. అటువంటి చోట్ల నాకూ, నా ముందు ఈ భూమ్మీద నివసించిపోయిన పూర్వమానవులకీ మధ్య ఒక సంవాదమేదో జరుగుతుంటుంది అనుకుంటాను... "

"ఇంగ్లాండ్!, 

షేక్స్పియర్ రంగభూమి. షెల్లీ, కీట్స్ ల ఇంగ్లాండ్, వర్డ్స్ వర్త్, కాలరిడ్జిల ఇంగ్లాండ్, డికెన్స్, డీక్వెన్సీల ఇంగ్లాండ్, షా, లారెన్స్ ల ఇంగ్లాండ్, మిల్, రస్కిన్ ల ఇంగ్లాండ్, న్యూటన్, డార్విన్ ల ఇంగ్లాండ్, ఆక్స్ ఫర్డ్, కేం బ్రిడ్జిల ఇంగ్లాండ్, స్మిథ్, బెంథామ్ ల ఇంగ్లాండ్, చాప్లిన్, హిచ్ కాక్ ల ఇంగ్లాండ్, మార్క్స్, ఎంగెల్స్ ల ఇంగ్లాండ్, గాంధీ, నెహ్రుల ఇంగ్లాండ్, నా దేశాన్ని పాలించిన ఇంగ్లాండ్, నా జాతి ద్వేషించిన ఇంగ్లాండ్, మా మనుషుల్ని మేల్కొలిపిన ఇంగ్లాండ్. పరస్పర విరుద్దమైన ఎన్నో భావాలు, బలమైనవీ, కోమలమైనవీ; స్పష్టమైనవీ, అస్పష్టమైనవీ ఎన్నో తెరలు తెరలుగా తరలిపోయాయి.. పునరిజ్జీవనం, మాగ్నకార్టా..........చరిత్ర-వర్తమానం విభజనరేఖలు చెరిగిపోయిన విశిష్టబిందువు వద్ద నిల్చున్నానన్న భావన నన్ను సంభ్రమపరిచింది".

ఓ ఎస్, మాగ్నకార్టా!

ఎవరబ్బా ఈయన? 'ఋతుపవనాల మలుపుల్లో తొలిజల్లులు' వేసిన మంత్రాల గురించీ, అవి 'వేసవి నేలల్ని తడుపుతున్నప్పుడు' పుట్టించిన కొత్త ఆయువుల గురించీ మాట్లాడుతూ మాగ్నకార్టా లోకి వెళ్లిపోయాడు!

ఇందాకటి ఈమెయిల్ ఫినిష్ చేయనే లేదు. ఏంటది?

"................మనుషుల మీది ప్రేమా అండ్ వాట్ నాట్?!! He mesmerized me! ముఖ్యంగా మీలాగా ఆయన నేచర్ ని, హిస్టరీ లని ఇష్టపడ్డా, మీలాగే తనకీ హిస్టరీయే కాస్త ఎక్కువిష్టమనుకుంటా. I seriously want to know your opinion on his travelogue".

***

నాలాగే ఈస్ట్ నుంచి వచ్చిన మనిషీయన. వెస్ట్ ఎలా కనపడింది?. ఇంగ్లాండ్ చరిత్ర తవ్వటమంటే, ప్రస్తుత ప్రపంచ చరిత్ర తవ్వటమే. ఎంపైర్ ఎండ్ అవ్వచ్చేమో, కాని ఇష్టమున్నా లేకున్నా, ఇంకా నడుస్తున్న చరిత్ర అది. మనసొప్పుకోకపోయినా అది మనందరి చరిత్ర. అసలు ఆయన దృష్టిలోకి ఏం వెళ్ళాయి? ఏయే మెతుకులు పట్టుకుని చూడాలనుకున్నాడు? 

ఈయన ఒక గాఢ భావుకుడన్నది తెలూస్తూనే ఉంది. నేత్రద్వయం సహాయంతో ఊహాలోకాల్లో వేసుకున్న చిత్రాలని పచ్చటి తెర మీదకి తిరిగి చిక్కటి వచనంలో ప్రొజెక్ట్ చేయటం ఆయన బలమే, కానీ గిరగిరా తిరుగుతూ దొర్లిపోయే ఈ గుండ్రటి ప్రపంచం దారిలో తనే తెల్లటి తెరయై పరుచుకోని, అది వెళ్లిపోతూ విడిచిపోయిన ముద్రణలు భద్రపరచుకోని, తనే ఒక పెయింటింగ్ అయిపోవడం ఈయన ప్రత్యేకత. అనుభూతుల్ని కలిగించే చిత్రంగానే కాదు, అధ్యయనం చేయాల్సిన గ్రంధంగా కూడా తను ఎదగడం ఈయన సత్యశోధన ప్రయత్నాలకి సాక్షం.

అసలివన్నీ కాదు. వీటన్నిటికన్నా మిన్నగా, ఈయన ఒక గొప్ప విధ్యార్ధి. 

కొత్త విషయం నేర్చుకోవటానికి వెళ్లినప్పుడు, మసక ముగ్గుపిండి కలరే కాదు, మరే ఇతర రంగూ పైన పేరుకోని నల్ల పలకని శుభ్రంగా పెట్టుకుని తీసుకుని వెళ్లే ఒక సిన్సియర్ విద్యార్థి.

అంతేకాదు ఈయన మనస్సొక పరుసవేది. తన ఇంద్రియాలకి గోచరించినవీ, అంతచక్షువులకి స్ఫురించినవీ ఆయన రాసుకుంటున్నప్పుడు, ఆ మనో:పలక పైన కంటికి కనిపించని అరల లోకి,పొరలలోకి అవన్నీ కవిత్వమై ఇంకుతాయి అనుకుంటాను. 

అందుకే కాబోలు, మన అదృష్టం బావుండి అది మనకి చదివే అవకాశం దొరికిన రోజున, చిక్కటడవి లాంటి చరిత్ర సైతం పత్రహరిత వనమై మనల్ని లోపలకి ఆహ్వానిస్తుంది. మనమెప్పుడూ చదవని కవుల కవిత్వానువాదాలు, తియ్యటి పళ్ల రూపం దాల్చి చేతికందే ఎత్తులో వేలాడుతుంటాయి. చర్చ్, స్టేట్ వ్యవహారాల ఏనుగులు మనముందే గంభీరంగా చెవులూపుకుంటూ వెళతాయి. మర్రిచెట్టు పైన కోకిల పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వినిపిస్తుంది, ఆ చెట్టు కింద కూర్చున్న తత్వవేత్తలు ఆ పాటలో, తమ పాఠాలు కలుపుతారు. పశ్చిమ గ్రామీణ ప్రాంత సౌందర్యాలు నెమలికంఠం రంగు పరికిణీలు కట్టుకున్న అమ్మాయిలయి అనంతమైన ఆకుపచ్చటి మైదానాల్లో ఆడుకుంటాయి. 

నాటకానికి మకుటాయమైన ప్రదేశంలోంచి వచ్చిన ట్రెడిషనల్ నాటకాలు, ఫౌస్ట్ నాటకాలూ అప్పటికప్పుడు అడవిలో మనకోసం ప్రదర్శించబడతాయి. థియేటర్ అనుభవాలు, గ్రామీణ జీవితపు కబుర్లూ, లైబ్రరీల, మ్యూజియం ల, గ్యాలరీల సందర్శనాలు వనంలోని చెట్లయి, ప్రతీ చెట్టూ పైనా ఉండే రామచిలుకలు మనల్ని దగ్గిరకి పిలిచి తమతమ చెట్ల గురించి ముచ్చట్లు చెపుతాయి. 

వెదురుబొంగులూ, రావిచెట్టు ఆకులూ, సరస్సు పక్కన రెల్లుగడ్డి పొదలు కలిపి చేసే ఆహ్లాద ధ్వనుల్లో పాశ్చాత్య శాస్త్రీయ ఆరోహణావరోహణల్లోని బి.బి.సి సింఫనీలూ, స్ట్రావిన్ స్కీ కృతులూ వినిపిస్తాయి. రెనసాన్స్ నాటి చిత్రకళా మేఘం చివరనుండి జారి, మోడర్న్ ఫోటోగ్రఫీ మెరుపొకటి కనిపించని చీకట్ల మీద మెరిసి, చాటున దాక్కున్న దృశ్యాల్ని చూపిస్తుంది. అంత త్వరగా అంతుపట్టని ఆధునికశిల్పకళ, ఊహా మేఘమై అర్ధం చేసుకోగలిగే ఆకారం లోకి వదిగి రంగులు మారుతుంది. 

లండన్ నగరం 'లక్షపక్షులు వాలిన రాజోద్యానంలా' కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. మేఘం చాటు చంద్రుడి వెన్నెల కొండపై పడి శిఖరాగ్రాన కూర్చున్న లండన్ పట్టణం, కిందనున్న వనమంతటికీ మెరుస్తూ కనపడుతుంది. వీధిపక్కన వాయిద్యం వర్షారణ్యపు మిస్ట్ అయి మన మీద కురుస్తుంది. వనంలో మనం దారి తప్పితే థాచర్, మేజర్, బ్లెయిర్ లు సరయిన దారి చూపించటానికి నేనంటే నేనే సరయిన వ్యక్తినని పోటీ పడి వస్తారు. 

షేక్స్పియర్ బాలనాగమ్మ మాంత్రికుడవుతాడు. క్రైటీరియన్ నాటకశాల లో కొత్త స్క్రిప్ట్ రచయితలు ఆ మాంత్రికుణ్ని బంధించి గేళి చేసే రాకుమారులవుతారు. పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ, వ్యక్తి శ్రేయోవాదం, సాంఘికవాదాలు బుర్రకథల రూపం దాల్చుతాయి. 

మార్క్స్, ఎంగెల్స్ మనం తిరుగుతున్న వనం లోని చెట్ల కాండాల్ని పరీక్షించడానికి వచ్చి, మనకేసి ఎగాదిగా చూసి పెదవి విరుచుకొని తలలడ్డంగా ఊపుతూ పోతారు. ఊహలవాడ యుటోపియా లో ఉల్లాసంగా సాగిన థామస్ మూర్ నడక, వాస్తవం వాగు రాళ్ళడ్డం పడి బోల్తాపడినప్పుడు, వనంలో వంతెన మీద మొండెం నుంచి తెగ్గొట్టబడిన ఆ స్వప్నప్రపంచపు తల వేలాడుతూ ఊగి ఆగిన దృశ్యం దుఖాన్ని తోడుతుంది. 

మన గాయం మీదనుంచి రాలిన రక్తపుధూళి ని కప్పుకున్న కోహినూర్ వజ్రం ఎప్పుడో తప్పిపోయి, ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. కానీ వనం లోంచి వెళ్లే ప్రతీ బాటసారి నిబిడాశ్చర్యంతో తడమడంతో కడగబడటం వల్లనేమో, స్వచ్చధవళంలా ఆకుచాటునుంచి మెరుస్తుంది.

ఎముకలుకొరికే చలిలోని బిక్షగాళ్లు కలతనిద్రల్లోంచి నడచొచ్చి పచ్చనివనంలో కాకులయి వాలతారు.

మరోతోవ లేకుండా ప్రపంచాన్ని అక్షరాస్యత వైపు నెట్టిన గూటెన్ బర్గ్ తొలి ముద్రిత గ్రంధం చెట్టు తొర్రలో కనపడ్డప్పుడు కమ్మిన ఉద్వేగం సుడిగాలయి రేగుతుంది. ఒకప్పుడు అల్లనేరేడి పళ్లని విరివిగా రాల్చిన చెట్టు ఈ రోజు ఎప్పుడో ఒకప్పుడు ఒకటీ అరా కాయ విదిలిస్తోందని ఇంగ్లీష్ సినిమా గురించి వాపోయిన వైనం వేడిగాలయి చుడుతుంది.

***

ఏం చెప్పను?

వనమంతా తిరిగొచ్చాక కండెన్స్డ్ మిల్క్ తో ఒక తీయటి పానీయం తాగిన అనుభూతిని మిగిల్చి, తల పైకెత్తి గ్లాస్ లోని ఆఖరి చుక్కలు సైతం గొంతులోకి వంపుకోవాలనిపించి, ఆ పై ఇంకా కావలనిపించి గ్లాస్ వెనకాల ఒకచేత్తోబాదినట్లుగా, అక్కడక్కడా పేజీలు తిప్పి మళ్లీ చదివి, ఆ పై మొదటిసారి గ్లాసోవర్ చేసిన లైన్లని తిరిగి చదివిపించాలనిపించే శైలి ఈ చినవీరభద్రుడి గారిది.

***
ఇంతకీ ఈ నిత్య పథికుడు నడుస్తూ చూస్తూ ఏమనుకున్నాడు? 

"..... దాని ఉదాసీనతా, గతంలోని రక్తపు చారికలు, అది లేవనెత్తిన పారిశ్రామిక నమూనాలోని భయానక పరిణామాలు, దాని అంతర్గతసంక్షోభం నాకు కలిగించిన సిక్ నెస్ మొదటివారమంతా నన్నంటి పెట్టుకునే ఉంది.......................కానీ ఈ నాగరిక ఉదాసీనతలో సూర్యరశ్మిలాగా మనుషుల ఆత్మీయత నన్నూరడించింది"

".......బ్రిటీష్ ఆంథ్రోపాలజిస్టుతో నేనన్నాను కదా....నన్నాకర్షించినవెన్నో ఉన్నప్పటికీ నేను మొట్టమొదట చెప్పగలిగేది మీ ప్రజలు అభ్యాగతుల పట్ల చూపిస్తున్న ఆదరణ. నా దేశం తన ఐదువేల ఏళ్ల సాంస్కృతిక చరిత్రలో ఎన్నో విలువల్ని పైకి తీసుకొచ్చింది. కాని ఆగంతకుడు, అభ్యాగతుడూ నీ ఇంటిముందుకు వచ్చినప్పుడు అతన్ని మిత్రుడిగా చేరదీసుకోవడమనేది నా దేశంలో ఇంకా ఆదర్శమే తప్ప పూర్తి ఆచరణకు రాలేదు. కాని ఇక్కడ ఎన్నో ఉదాహరణలు. మీ దేశం వైభవం మీ పరిశ్రమల్లో , కవిత్వంలో, రాజవంశీకుల ఆభరణాల్లో, ఆర్కిటెక్చర్ లో లేదు. అది అపరిచుతుల్ని మిత్రులుగా దగ్గరకు తీసుకోగలిగే సంస్కారంలో ఉంది అని"

".....తన లోపాల గురించి తనకు గల ఈ జాగృతి లోనే ఐరోపీయమానవుడి నిజమైన విజయం ఉందనిపించింది నాకు. .."

"..ఆ రాత్రి నేను క్రీస్తు పునరుత్థానం చెందడాన్ని కళ్లారా చూసాను. మృత్యుతుల్య హిమరాత్రులనుండి సూర్యరశ్మిమంతమైన వసంతప్రభాతల్లోకి మేల్కొంటున్న జనజీవితం నన్నుకూడా నా గాఢనిద్రనుండి పైకి లేపింది........ ఆ రాత్రి నేను నా జీవితంలోకెల్లా అత్యంతసుందరమయిన దాన్ని దేన్నో చూసినట్లే భావిస్తున్నాను. లండన్ మహానగరంలోని ఆ రాత్రి తరువాత నేను మరింత బలోపేతుడిగా, సంతోషభరితుడిగా మారానని చెప్పుకోడానికి నాకేమీ సంకోచం లేదు..."
*
ఎన్నో రకాల సంవేదనలనంతరం ఆయన స్పందనలేమిటి? ఈ విద్యార్థి "నేను తిరిగిన దారుల్లో" అని పేరు పెట్టుకున్న పుస్తకంలోని ఈ దారి చివర కూర్చొని చివరి పేరాగా ఏం రాసుకునుంటాడు?

"ఈ కొద్ది రోజుల అనుబంధంలో ఇంగ్లీష్ మానవుడి గురించి ఏం గ్రహించాను నేను? ఎన్నో సందర్భాల్లో అతని ఔదార్యానికీ, సంస్కారానికి చేతులు జోడించాను. మరెన్నో సందర్భాల్లో అతని వ్యథకీ, సంక్షోభానికీ నా సంఘీభావాన్ని ప్రకటించాను. ఒకప్పుడు ఇతర జాతుల్ని ద్వేషించి అణచి వుంచిన ఇంగ్లీష్ మానవుడు కాడు ఇతను. మహాచారిత్రకయుగాల అనంతర దశలోని మానవుడు ఇతను". 

"హైద్రాబాద్ లో బాగా నిద్రపట్టిన ఒక రాత్రి ఏదో రెక్కలగుర్రంలో కలలో ఆ పచ్చికబయళ్లలోకి తప్పిపోయి ఒకరోజంతా తిరిగి మళ్లా ఏ కారణంచేతనో నాగదిలోకి నా రొటీన్ లోకి మేలుకున్నట్లుంది , ఇప్పుడా యాత్ర గుర్తొస్తే".

*****

ఈ అధ్యాయం ఒక్కదానికే పుస్తకంలో నాలగవ వంతు కేటాయించారు రచయిత. ఇది కాక ఇంకా అరకు, శ్రీశైలం, పాపికొండలు, త్రయంబకం, ఆగ్రా, మధుర, అరుణాచలం, ఢిల్లీ లో తన యాత్రానుభవాలు, యాత్రాలేఖలు, యాత్రాకథనాలు భద్రపరిచి, తన భద్రమన్నయ్యకి అంకితమిచ్చారు. 

మరి, పరాయిదేశమే కాదు, ఒకప్పుడు తనని పాలించిన దేశమూ, తనంతగా ఇష్టపడని పారిశ్రామిక నమూనా సంఘంలోనే ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగిన మనసు, తన దేశంలోనే రంగు రంగు అందాల మెత్తటి పూపొప్పొడి పరుపుల్లోకి విసరబడ్డప్పుడూ, ఆధ్యాత్మికత జ్యోతి తన ఆత్మని వెలిగించినప్పుడూ తన మనసు ఏం లిఖించుకొని ఉంటుందో కదా?!!

అవి చదువుతుంటే, మసీదులోని బాబా మనకై పొగ ఊది, చేతిలోని దండంతో మెత్తటి ఈకలని కళ్ల మీదుగా జార్చినప్పుడు కలిగే అనుభూతి కలుగుతుంది. 

ఓపికుంటే ఆ వివరాలు మరెప్పుడైనా.

Sunday, 28 September 2014

Siesta of Sienna & San Gimingnano

Posted by Kumar N on 9/28/2014 01:00:00 pm with 1 comment
Metropolis లలో ఉండే సొగసు ఒకరకమయితే, Medieval Town లలో ఉండే అందం వేరే అన్న విషయం తెలిసిందే. 

Sienna వీధుల్లో నడూస్తూంటే, ముఖ్యంగా San Gimignano లో మా నాయనమ్మా, నాయనమ్మ ఊరూ, వేసవికాలం మధ్యాహ్నపు వీధుల్లో గాలి కూడా చెట్టు నీడనెతుక్కొని ఒంగి పడుకున్న మత్తు కాలం, ఇంటి ముందు పందిరి కింద అరుగుల మీద నడుం వాల్చిన సుఖం, వీటన్నిటినీ కలపి పసుపుకుంకుమాసుగంధం కలిపిన గుడ్డలో చుట్టి సంతుకలో పెడితే కాలక్రమేణా అడుగునకెక్కడో మూలకి జారిపోయిన ఆ చిన్నసంచీ ఒక్కసారిగా బయటపడి సువాసనంతా వ్యాపించినట్లుగా నా ఆత్మని నింపేసాయి.

ఈ ఊర్లు ఎంత మాగన్నుగా కునుకు తీస్తూంటాయో, మధ్యాహ్నం పూట!!.

ఇంట్లో అందరూ నిద్రపోతున్నా, ఎప్పటికీ ఆటలాపని పిల్లలు ఇంట్లోకీ బయటకీ తిరుగుతున్నట్లుగా, చూట్టానికి వచ్చిన వాళ్లు మాత్రం ఏవేవో వెతుక్కూంటూంటారు.

వస్తూ పోతూ వంటింట్లో ఏదో కుండలో చేయిపెడితే, దొరక్కుండా దాచిపెట్టిన బెల్లంపట్టీ దొరికి వళ్లే కాక కళ్లు కూడా ఎగిరిపడినట్లుగా, మాకు ఎదురుచూడని మూలన ఒక జెలాటో దొరికింది. ఉర్సు ఉత్సవానికి  మాంచి గులాబీ రంగు పీచు మిఠాయి దొరుకుతుందని ఆశతో వెళ్లినట్లుగా, ఇటలీ వెళ్లి అంతా జెలాటోల కోసం తిరిగిన మాకు రోమ్, ఫ్లారెన్స్, వెనిస్ నగరాలలో దొరకని కమ్మటి జెలాటో కుండలు దొరికాయి.

ఇటలీ అధికారులు సైతం, అమెరికా మొట్టమొదటి కుటుంబాన్ని ఇదే దుకాణం కి తీసుకొచ్చి తినిపించారట.

మీరెప్పుడన్నా మాఅంచి జెలాటో కావాలని వెతుక్కూంటూంటే San Gimignano లో ఈ కింద కనపడిన ప్లేస్ కి వెళ్ళండి, మీకు నచ్చే జెలాటో దొరుకుతుందని నా పూచీ.


Sunday, 16 February 2014

లోపలి మనిషి లోపల

Posted by Kumar N on 2/16/2014 11:18:00 pm with 2 comments
  • సాహిత్యాన్నీ, చరిత్రనీ విరివిగా చదువుకున్న వ్యక్తి, స్వయాన ఒక రచయిత. 
  • దేశీయ, అంతర్జాతీయ భాషలు కలిపి దాదాపు డజను పైనే భాషల్లో నైపుణ్యం, 
  • భారతదేశ స్వాతంత్రానికి పూర్వమే నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నేపథ్యం, 
  • స్వాత్రంత్రానంతరం తనెన్నుకున్న వృత్తిలో అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ ఎమ్మెల్యే నుంచి, ఎమ్. పి, మంత్రీ, ముఖ్యమంత్రీ, కేంద్రమంత్రీ, చివరకి అత్యున్నత స్థానమైన ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి. 
  • ప్రపంచ దేశాల్ని చుట్టిన విదేశీవ్యవహారాల నిపుణుడు. 
  • ముఖ్యంగా, సుదీర్థ చరిత్రని చూసిన వ్యక్తే కాదు, చరిత్ర చరిత్రలా ఎలా మారుతుందో, తయారవుతుందో కూడా తెలిసిన వ్యక్తి. 
  • భారతదేశావతరణ పరిణామక్రమంలో ముఖ్యమైన ఘట్టంలో ముందువరసలో ఉన్న వ్యక్తుల్లో ఒకరు, 
  • భారతదేశమే కాక ప్రపంచం కూడా గర్వించదగ్గ వ్యక్తులు పుట్టిన ఆ స్వాతంత్రకాలంలో వారి సందేశాలకీ, విలువలకీ స్పందించి దేశనిర్మాణానికై పాటుపడ్డ ప్రథమశ్రేణుల్లోని సైనికుడూ, 
  • ఆ పిదప దేశ సుదీర్థ ప్రయాణంలో డ్రైవర్ సీటు పక్కనే కూర్చోని సలహాలిచ్చిన వ్యక్తి, తద్వార చరిత్రలో పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ముఖ్య భూమిక పోషించిన ఆస్థానంలో భాగస్వామీ, ఆంతరంగికుడూ, 
  • స్వాతంత్రపోరాటంలో జాతిని నడిపిన దార్శనికులు నిర్దేశించిన దిశయే దేశానికి సరైనదని నమ్మిన రాజకీయవేత్తా, అదే దిశలో తను నడచీ, దేశాన్నీ నడిపిన సారథుల్లో ఒకరూ, 
  • జీవితాంతం తను నమ్మి ప్రయాణిస్తోన్న మార్గం, దేశాన్ని డొంకల్లోంచి నడిపిస్తోందనీ, అగాధం వైపు తీసుకెళ్తోందనీ, కంటిచూపు పరిథిలో లోయ అంచు కనపడుతోందని గ్రహించిన మరుక్షణం, అనుకోకుండా డ్రైవర్ సీట్లో ఉన్న తను దేశ దిశని అమాంతంగా సురక్షిత మార్గం వైపు మరల్చిన వ్యక్తీ, 
  • ఆ భాగంలో ఎన్నో కుదుపులకీ, ఎగుడుదిగుడులకీ ఓర్చుకొని, తోడ్పాటునందించాల్సిన రాజకీయ యంత్రాంగం అడుగడుగునా తనని డ్రైవర్ సీట్లోంచి లాగే ప్రయత్నాలని కాచుకోని, ఎత్తుకు పైఎత్తు వేస్తూ, మొక్కవోని దీక్షతో ప్రమాదాన్ని నివారించి, దేశరథాన్ని ఒక హైవే మీదకి తీసుకురావటమే కాక, ప్రగతిపథాన దూకించిన వ్యక్తీ, అంతేకాక ఈ కొత్త ప్రగతి రథం లో కోట్ల మందికి కొత్తగా స్థానం కలిపించిన దేశనిర్మాతా..
అయిన పి వి నరసింహారావు గారు రిటైర్ అయ్యాక రాసిన పుస్తకం అనేసరికి ఆసక్తి, అంచనా పెరగడం సహజం.

ఇది ఫిక్షన్ పుస్తకమనీ, ఇందులోని ఆనంద్ పూర్తిగా తనే కాననీ, కేవలం నా జీవితంలో ఎదురయిన అనుభవాల్లోంచి మాత్రమే ఆనంద్ వెళ్లేలా ఈ పుస్తకాన్ని రచించాననీ పివి గారు చెప్పినప్పటికీ, రిటైర్ అయిన దేశాధ్యక్షుల పుస్తకాలు ఇంతకుముందు చదివిన అనుభవం మూలాన కాబోలు కొన్ని అంచనాలు ముందే నాలో స్థిరపడ్డాయి.

ఆ అంచనాల నేపథ్యంలో ఈ పుస్తకాన్నందుకొని చదవటం మొదలుపెట్టాక, తొలిపేజీల్లో బాగానే సాగినప్పటికీ, ఒక వంద పేజీల పైన పూర్తి చేసేసరికి చిరాకు పుట్టేసిన మాట వాస్తవం. అసలు ఈ పుస్తకం రచయిత ఎవరని కూడా అనుమానమొచ్చేసింది నాకు. 
  • నెహ్రూ కాలం నుంచి ఇండియా చరిత్రని, నెహ్రు తదితరులు చేప్పట్టిన బృహత్తర దేశనిర్మాణ ప్రణాళికని అమలుపరచిన రాజకీయవ్యవస్థలోని భాగస్వామిగా 
  • ఇండియా ఈజ్ ఇందిర - ఇందిరా ఈజ్ ఇండియా అని పేరుపొందిన కాలంలో ముఖ్యమైన మంత్రిత్వ శాఖల అధినేతగా 
  • కోల్డ్ వార్ ముందు పాటించిన అలీన విధానాలని నెత్తికెత్తుకున్న ప్రభుత్వాలకి చెందిన అధికారిగా 
  • కోల్డ్ వార్ ముగిసాక ఒక భారీ కుదుపుతో దేశాన్ని పెద్ద మూలమలుపు తిప్పిన వ్యక్తి వాంటేజ్ పాయింట్ లోంచి వస్తున్న పుస్తకంలో ఏవయితే ఉంటాయని అనుకున్నానో 
అవి కాకుండా చిన్న వయసులో జననాంగాల పట్ల ఉండే సహజ క్యూరియాసిటీని, ఎవరిగురించయితే రాసారో వారు బ్రతికుండి చదివినట్లయితే ఎంత ఎంబరాసింగ్ గా ఫీలవుతారో అన్న కనీస స్పృహ లేకుండా తను చిన్నతనంలో పెరిగిన ఇంట్లో చిన్నాన్న కూతురు జెనిటల్స్ చూపించిన సంఘటన గురించి రాయటమూ, అర్ధరాత్రి మెలకువొచ్చి చిన్నాన్న, చిన్నమ్మ లమధ్య కార్యక్రమాన్ని కాళ్ళు విడదీయడంతో సహా వివరించటమూ, మిత్రుడి సున్తీ కార్యక్రమంలో కోసేయటాన్ని గురించిన తత్వచింతనా, తన సమకాలీకులైన ఇతర రాష్ట్ర రాజకీయ నేతలని గురించి సుదీర్థంగా వివరిస్తూ 'ఆ పడుపుగత్తె జారిన స్థనసంపదను నిమురుతున్న క్షణంలో అతనికి జ్ణానోదయమైంది" ఇలాంటి వ్యాక్యాలు ఒక్కసారికన్నా ఎక్కువ సార్లు తగలడంతో నాకు కొంచెం చిర్రెత్తింది.

కమాన్ సర్, ప్లీజ్ మూవాన్ ఐ యామ్ లుకింగ్ ఫర్ సమ్ థింగ్ ఎల్స్ ఇన్ యువర్ బుక్ అని అనుకొన్నాక, మళ్లీ ఇంకోసారి కూడా కనిపించేసరికి నేనే మూవాన్ అవుదామని పుస్తకం నాలుగు రోజులు ముట్టలేదు మళ్లీ.

రచయిత అవి రాయటం తప్పని నేను అనుకోలేదు, ఆనంద్ కి సహజంగా వచ్చిన పరిశీలనా తత్వమూ, కుతూహలమూ, ప్రశ్నించి, శోచించి సమాధానాలు కనుక్కునే అతని పాత్ర నిర్మాణం కోసం అవి అవసరమేమో కాని, నేను ఆశించిన వైపు వేగంగా 'కథ' ని తీసుకెళ్లకుండా, అక్కడే ఇంత సేపు తచ్చాట్లాట్టం నాకు నచ్చలేదు.

ఈయనకేమయిందా? కొంతమంది అకంప్లిష్డ్ మగవాళ్ల లాగా, స్త్రీ గురించి వర్ణించడానికి ఏ కాస్త అవకాశమున్నా శృతిమించే కొంతమంది రచయితల్లాంటివాడా పివి అన్న అనుమానం రాకపోలేదు. మరో కారణమేంటంటే, ఆ రాష్ట్ర రాజకీయాల కాలం నాకు మరీ ముందయిపోవటం వల్లనేమో , రచయిత మార్చిన పేర్ల వల్ల ఆ వ్యక్తులెవరో నాకు తెలీకపోవటం, ఇంటర్నెట్ ని ఆశ్రయించి తెలుసుకున్నా కూడా నా కన్నా ముందు కాలంలోని రాజకీయ వ్యక్తుల గురించి సరిగ్గా అవగాహన లేకపొవటం వల్ల కూడా నాకు బోర్ మొదలయింది. నేను ఎక్స్ పెక్ట్ చేసింది స్వాతంత్రం ముందు గాంధీ గారితో ఏమైనా నేరుగా కాని, పరోక్షంగా కాని పని చేసారా, లేక ఉత్తర ప్రత్యుత్తరాలేమైనా నడచాయా, గాంధీ, నెహ్రు ల మీద తన ఆలోచనలూ, అభిప్రాయాలూ, వివిధదశల్లో దేశస్థాయి రాజకీయాలు, తను చూసిన క్లిష్టపరిస్థితులూ, ఇంధిరాగాంధీతో తనకున్న గాఢ మైత్రీ, అనుబంధమూ, ఆ నేపథ్యంలో ఇందిర మీద తన ఆలోచనలూ, సంక్షోభ సమయాల్లో, వివాదస్పద విషయాల్లో దేశనాయకత్వ వైఖరీ, ముఖ్యంగా వీటన్నిటినీ మించి తన విదేశాంగ శాఖ మంత్రిత్వ అనుభవాల్లో వివిధ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఎలా చూసాయీ, అమెరికా తో తన అనుభవాలేమైనా ఉన్నాయా లాంటి వాటి గురించి ఆశించి పుస్తకాన్నందుకున్నాను.

అయితే నాలుగు రోజుల తరువాత మళ్లీ పుస్తకాన్ని అందుకొని చాలా మంచి పని చేసాను. కొన్ని సార్లు నాకక్కరలేని ఆసక్తిలేని పాత్రల సంభాషణలు విసుగు తెప్పించిన మాట కూడా వాస్తవమయినప్పటికీ, పైన చెప్పిన వర్ణనలు ఆ తరువాత రాలేదిక. పైగా నేనాశించినవన్నీ కాకపోయినా కొన్నిటినీ చాలా లోతుగా వివరించారు.

ఈ 'నవల'(?!) ప్రారంభంలో ఆనంద్ బాల్యం గురించి రాస్తూ తెలంగాణాలో స్వాతంత్రానికి పూర్వమున్న వాతావరణాన్ని పరిచయం చేస్తారు పి.వి. ఆనంద్ స్ఫురధ్రూపి అవడం వల్ల, చదువు కోసం దూర గ్రామాలకి వెళ్ళటం, స్కూలులో ఇతర భాషల మీద పట్టు అతి త్వరగా సాధించటం, తనకి సహజంగా వచ్చిన సునిశిత పరిశీలనా, తత్వచింతనా వల్ల తను పెరుగుతున్నకొద్దీ చుట్టూ గమనిస్తూన్న సమాజం లోని విభిన్నమైన విషయాలు, పరస్పర విరుద్దంగా ఉండే కనపడే ఆచారాల గురించి ఆనంద్ లోతైన ఆలోచనలు పాఠకుడిగా మనకి తెలుస్తుంటాయి. అందులో భాగంగా నైజాం దాష్టీకం, తెలుగుని అణచివేసి, పర్షియన్ ని ప్రమోట్ చేసిన తీరూ, నైజాం పరిపాలనలోనే ప్రజా వ్యతిరేకంగా రాచరికం కొమ్ము కాస్తున్న హిందూ-ముస్లిం కూటమి వైఖరీ, దాని పట్ల ఆనంద్ ఆలోచనల గురించి మనకు అర్ధం అవుతుంది.

స్వాతంత్రానికి పూర్వం నైజాం ప్రభుత్వం, నిజాం ఏరియాకి అవతల బలంగా వీస్తున్న స్వాతంత్రపవనాలని గుర్తించి, అవి తమ ప్రాంతంలో యువకులని ప్రభావితం చేయకూడదని, రైళ్లని నైజాం ఏరియాలో ఆగకుండా నేరుగా దాటివెళ్లడానికి మాత్రమే అనుమతినిచ్చి, వార్తాపత్రికలు ఊళ్లల్లోకి రాకుండా ప్రయత్నించిన తీరూ, వివిధ పుస్తకాలనీ, చివరకి నెహ్రు రాసిన Letters from a Father to his Daughter, Glimpses of World History లాంటివి కూడా నిషిద్ద సాహిత్యం కింద చేర్చి, అవి చదివేవారిని ఎలా టార్గెట్ చేసిందీ చదివినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు.

ఈ పుస్తకంలో ఇంకా:
  • నైజాం కి వ్యతిరేకంగా తిరుగుబాటుదార్లతో తను తిరిగిన విశేషాలూ, 
  • స్వాతంత్రానంతరం కేంద్రం హైదరాబాద్ ని స్వాధీనం చేసుకోవడం గురించి క్లుప్తంగా వివరణా, 
  • హైదరాబాద్, ఇండియాలో విలీనం అయిపోయాక తన భవిష్యత్తు గురించీ, రాజకీయాల్లో ఉండాలా లేక తనకి చేతకాని సంపద పరుగుపందెమనే సాధారణ జీవితం వైపు మళ్లాలా అన్న ఆలోచన గురించీ, 
  • స్వాతంత్రం వచ్చాక జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తన ఓటమీ, ఆ పిదప అంత:శ్శోధనా, అదే ఎన్నికల్లో ప్రతీ ఓటరుకీ అయిదెకరాల భూమీ, ఆవూ ఇస్తామని కమ్యూనిస్ట్ పార్టీ(?) చేసిన వాగ్ధానమూ!! 
  • తన రాజకీయ సంబంధాలూ, రాజకీయాలలో తిరుగుతూ ఆనంద్ పిత్రార్జితాన్నీ సైతం తగలేయటం పట్ల ఆనంద్ భార్య వీణ అసంతృప్తీ, ఆ నేఫథ్యంలో భారతీయవివాహ వ్యవస్థలోని లొసుగుల మీద తన అంతరంగం, చివరికి అసంతృప్తితో తను రాజీపడిన వ్యాఖ్యలూ 
  • రెండవ సార్వత్రిక ఎన్నికల్లో అరుణ పరిచయమూ, ఆ ఎన్నికల్లో తన విజయమూ 
  • ఆ తరువాత తను రాష్ట్రంలో మంత్రిగా నియామకమయిన విధానమూ, ఆ అధికారం రూపు రేఖల గురించి తన విచారణా 
  • సమాజంలోని సంతులన దెబ్బ తీయడానికి గల కారణాలూ, అసమనాతల కారణాలేమైనా వాటిని తగ్గించటంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్రా 
  • అసలు అసమానతలకి మూల కారణం ఎక్కడుండి వచ్చన్న తత్వచింతనా, ఇవన్నీ కలపి తను సోషలిజం వైపు మొగ్గడమే కాక, సోషలిజం మీద తనకి బలంగా పెరిగిన నమ్మకమూ 
  • క్లిష్ట సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా తన అన్యార్ధం(అదర్-హాఫ్) ఏదో వచ్చి తన చెంతన చేరి న్యాయమైన నిర్ణయం తీసుకొమ్మని ప్రోత్సాహించిన తీరూ 
  • అరుణ మానసిక ధోరణులూ, తన కుటుంబ పరిస్థితీ, తన ఆవేశాలూ, ఉద్రేకాలూ, అరుణ తనింట్ళో వాళ్ల మీద చేసిన తిరుగుబాటూ, అరుణ సన్యాసిని జీవితమూ 
  • అరుణ ఆనంద్ కి దగ్గరి మనిషని తెలిసి తన దగ్గిర పెరిగిన రికమండేషన్ల వ్యవహారాలూ 
  • మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయేముందూ, చేసాక అధికారం గురించి తన ఆలోచనలూ 
  • మహేంద్రనాధ్(నీలం సంజీవరెడ్డి?), చౌదరి(బ్రహ్మానందరెడ్డి?) ల మధ్య జరిగిన నిరంతర రాజకీయ కుట్రలూ, 
  • ముఖ్యమంత్రి చౌదరి తో సోషలిజం గురించిన సుదీర్ఘచర్చలూ, 
  • అందులో తనకి అత్యంత ప్రధానమైన భూసంస్కరణల గురించిన వాదనలూ, ఆహారఉత్పత్తే సరిగ్గా లేని భూమిని ఇప్పటికిప్పుడు పంచి దరిద్రాన్ని పంచడం తప్ప ఏముందనీ ఒకవైపూ, ఆహరఉత్పత్తి సమృద్దిని ముందు సాధించి తరువాత పంపిణీ వ్యవస్థని మెరుగుపరచి ఆ తరువాతే భూమిపంపిణీ చేయడం సరైనదేమో అని మరోవైపూ తను పడిన మల్లగుల్లాలూ 
  • మున్సిపాలిటీల ఆదాయం పెరగటానికి ఇంటద్దె ఆదాయం మీద కాకుండా, ఇంటి విలువ మీద పన్ను వేసేట్లుగా తను ప్రతిపాదించిన చట్టాల గురించిన వివరణలు 
  • మధ్యలో పొలిటికల్ మానిప్యులేటర్స్ అయిన శేఖర్ లాంటి పాత్రలూ, పదవులే అంతిమలక్ష్యంగా సాగే వారి రాజకీయ క్రీడలూ 
  • జవహర్ లాల్ నెహ్రూ వ్యక్తిత్వం, దార్శనికతా, ప్రణాళిక ల గురించీ, ఆయన మీద దేశప్రజలకి ఉన్న నమ్మకం గురించీ, ఆయన మీద ఆనంద్ కి ఉన్న అచంచల భక్తీ, విశ్వాసాల గురించి ఎన్నో వ్యాఖ్యానాలు 
  • దేశం ఎదుర్కొన్న చైనా యుద్దం గురించీ, ఆ యుద్దానికి దారితీసిన పరిస్థితుల గురించీ, ఆ కాలంలో ఆయన చేసిన గ్రామపర్యటనలో దేశం బయటనుంచి వచ్చిన ఈ ప్రమాదం, అదే సమయంలో దేశంలో పెరుగుతున్న అవినీతిని గుర్తిస్తూ నమ్మకం కోల్పోతున్న ప్రజలని ఎలా సంఘటితం చేసిందీ వివరించారు. ముఖ్యంగా చైనా దురాక్రమణ కథ ఎక్కడ ప్రారంభం అయ్యిందన్న విషయం గురించిన సుదీర్ఘవివరణ దాదాపు ఇరవై పేజీలు సాగింది 
  • చైనా దురాక్రమణ తరువాత నెహ్రుకి తగ్గిన పలుకుబడీ, కానీ ఆయనకి ప్రత్నామ్యాయంగా ఏ ఒక్కరూ ఎదగలేకపొవటం, కామరాజ్ పథకం గురించి కొన్ని విషయాలూ 
  • 1964 లో నెహ్రు మరణం, అది దేశప్రజల మీదా, దేశమనోఫలకం మీదా చూపిన ప్రభావం 
  • లాల్ బహుదూర్ శాస్త్రి పగ్గాలు తీసుకున్న వైనమూ 
  • అలీనవాదం గుండా భారత్ చేసిన ప్రయాణమూ, దాని గురించిన తన వ్యాఖ్యానాలూ 
  • లాల్ బహుదూర్ శాస్త్రి గారి మరణమూ 
  • రాష్ట్రం లో హిందూ-ముస్లిం ల మధ్య ఉన్న వాతావరణమూ, లౌకికవాదం గురించి నెహ్రూ పడిన తపనా, కాని ఆయన నమ్మిన ఈ విలువ పట్ల ఎవరికీ లేని నమ్మకమూ, ముస్లిం మైనారిటీల పట్ల హిందువుల అపనమ్మకాలూ, పాకిస్తాన్ తో సైనిక ఘర్షణలూ, పాకిస్తాన్-భారత్ మధ్య విభజనరేఖలో లేని స్పష్టతా గురించి స్పృశించారుఇంట్రస్టింగ్ గా ఇండో-చైనా వార్ గురించీ, పాకిస్తాన్ తో యుద్దం ముందు గురించీ తన వ్యాఖ్యానాలు రాసేప్పుడు పివి గారు, సంధర్బానుసారంగా హిస్టరీ రాసిన ఇతర రచయితల పుస్తకాలలో భాగాలని ప్రచురించారు.
ఆ తరువాత ఏర్పడిన పరిస్థితులలో ఆనంద్ , ఇందిరాగాంధీ వైపు మొగ్గు చూపి, ధృఢంగా నిలపడటం, తదుపరి పరిణామాల్లో ఇందిరాగాంధీ అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవటం కోసం చేసిన చర్యలూ, ముఠాల కుమ్ములాటలూ, అవసరమైనప్పుడు ఇందిరాగాంధీ కమ్యూనిస్టు పార్టీల దగ్గర్నుంచి తీసుకున్న సపోర్టూ, నక్సల్ బరీ ఉద్యమం అవతరణా, ఆ నాయకులతో తన ఆసక్తికరమయిన సంవివాదం, రాష్ట్రంలో భూస్వాముల దగ్గర్నుంచి వస్తూన్న వ్యతిరేకతా, రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం, ఇందిరాగాంధీ వెనక ఏర్పడిన అమాంబాపతు మందీ మార్భలమూ, బ్యాంకుల జాతీయకరణా, బ్యాంకు రుణాల మంజూరీ, దాంట్లో దళారుల జోక్యమూ, ఈ లోపల భూమి ఇస్తామని చేసిన తమ పార్టీ చేసిన వాగ్ధానాలు ఎంత కాలం గడచినప్పటికీ అమలుజరక్కపోవటం పట్ల తన అసహనం, భూసంస్కరణల అమలుపరచాలన్న మొక్కవోని తన పట్టుదలా, ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టిలో చీలికా, గరీబ్ హటావో నినాదాలూ, ఇందిరాగాంధీ ఘనవిజయం, బంగ్లాదేశ్ అవతరణా, ఇందిరాగాంధీ తిరుగులేని శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగిన తీరూ ల మీదుగా పుస్తకం సాగుతుంది.

చౌదరి ని ముఖ్యమంత్రిగా తప్ప్పించి ఆనంద్ ముఖ్యమంత్రిగా నియామకం, స్వయాన తనే ముఖ్యమంత్రి అయ్యాక భూసంస్కరణలని వేగంగా తన హయాంలోనే అమలుపరచాలన్న తన ధృఢమైన ఆశయం, ఆ దిశగా తన ఆదేశాలూ, సంస్కరణల అమలుకి కనీసం ఆరేళ్లు పడుతుందన్న అధికారుల నివేదికలూ, తద్వారా తను మొదట కృంగిపోయిన తీరూ, ఆ విషమ పరిస్థితిని తనెలాంటి ఉపాయలతో ఎదుర్కొని పరిష్కరించుకున్న తీరూ, ఈ మధ్యలో బినామీ పేర్లతో లెక్కలేనన్ని రిజిస్ట్రేషన్ల సమస్యా, ఆ సమస్య పరిష్కారానికి తను అమలు పరచిన పథకమూ, ఇత్యాది విషయాల గురించి పి వి గారు చాలా విపులంగా వివరించారు.

కానీ ధృఢ చిత్తంతో భూసంస్కరణల విషయంలో తను దూసుకువెళ్తున్న తీరు, భూస్వాముల ఆగ్రహానికి గురై, ఎన్నో ఆందోళనలూ, వీధిపోరాటాలు చెలరేగి , చివరకి అవి ఢిల్లీ దాకా చేరి, తనకు వ్యతిరేకంగా పనిచేసి చివరకి ఇందిరాగాంధీ ఆనంద్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించే ఘట్టం దాకా సాగుతుంది పుస్తకం.

ఆ సమయంలో ఆనంద్ మరో పార్టీ ని పెడతారని నమ్మిన కాంగ్రెస్ వర్గాలు, సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సమక్షంలోనే దాని గురించిన చర్చా, కాని పార్టీని, ఇందిరని తనెప్పుడూ విడచిపెట్టనని తను చేసిన బాసలూ, చివరకి ఇందిర వెంటే ఉన్నందుకు తనకు లభించిన కేంద్రమంత్రి పదవుల గురించి, చివరకి రాజీవ్ గాంధీ మరణంతో ఏర్పడిన ప్రత్యేకమయిన పరిస్థితులలో ఆనంద్ ప్రధానమంత్రి అయ్యాడన్న క్లుప్తమైన పారాగ్రాఫ్ తో పుస్తకం ముగుస్తుంది. 

అయితే ఈ పోస్టులో మొదట చెప్పినట్లుగా నేను ఆశించిన కాలానికి రాకుండానే ఈ పుస్తకం ముగియటం డిసప్పాయింటింగ్.

***

రాజకీయనాయకులు, ప్రధానమంత్రులు పుస్తకాలు రాయటం మన దేశంలో కాస్త తక్కువయినా, మిగతాదేశాలలో అది అరుదేమీ కాదు. కానీ రిటైరైన ఒక ప్రధానమంత్రి తన జీవితాన్నీ, అనుభవాలనీ "ఫిక్షన్" గా రాయడం చాలా అరుదనే చెప్పాలి. ఇలా ఎందుకు రాసారా పి.వి గారు అన్న ప్రశ్నకి సమాధానం వెతుకుతూ పోయినప్పుడు ఈ పుస్తకం గురించిన చాలా ఆసక్తికరమయిన వివరాలు చాలా తెలిసాయి.

పి.వి గారు ఈ పుస్తకం తొలి భాగాలని, తన ముఖ్యమంత్రి పదవి పూర్తికాలం నిండకుండానే ముగియడంతో, ఢిల్లీకి పిలవబడిన తొలినాళ్లలో ఖాళీ సమయంలో రాసారని, ఆ తరువాత ఎమర్జెన్సీ కాలం ముగిసాక ఇందిరాగాంధీ పదవి కోల్పోవటంతో తనకి మరింత ఖాళీ టైం దొరికినప్పుడు రాసారని తెలిసింది.

పివి అక్నాలెడ్జ్ చేసిన ఫిక్షన్ వర్క్ అయిన ఈ పుస్తకం తో జాతీయస్థాయిలో ఆయన రచయితగా తెలిసినప్పటికీ, తెలుగు వారికి ఆయన రచయితగా, ముఖ్యంగా వేయిపడగల అనువాదం గురించి చిరపరిచితమే. ఆయన మారుపేరుతో అప్పుడప్పుడూ పొలిటికల్ కామెంటరీ రాసేవారనీ, సాక్షాత్తూ ఎమర్జెన్సీ కాలంలోనే ఎమర్జెన్సీ ని విమర్శిస్తూ తన చిరకాల మిత్రుడు నిఖిల్ చక్రవర్తి ఎడిటర్ గా ఉన్న మెయిన్ స్ట్రీమ్ పత్రికలో Insider పేరుతో రచనలు చేసేవారనీ, 1990 లలో ఆయన ఇందిర హయాంలో కాబినెట్ మార్పుల గురించి Insider పేరుతో రాసిన skit 'The Reshuffle" రాసారని తెలిసింది. 

ఈ పుస్తకాన్ని మొదటగా Other-half అన్న పేరుతో రాసారట. ఆ Other-half అన్న ఊహాజనితవ్యక్తి ని ఈ Insider అన్న పుస్తకంలో కూడా కొన్నిసార్లు చూడవచ్చు. తను ఏ నిర్ణయం తీసుకోవాలా అన్న డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు తన ఎదురుగా ప్రత్యక్షమయ్యి తనకి మార్గదర్శకత్వం చూపే ideal-persona ని ఆనంద్ other-half (అన్యార్ధం) అని చెపుతూంటాడు ఆనంద్ ఈ పుస్తకంలో. 

అయితే ఒరిజినల్ గా రాయబడిన Other-half అన్న పుస్తకంలో ఆనంద్ పాత్ర నిరంజన్ గా , అరుణ పాత్ర సుమిత్ర గా, వారిద్దరి మధ్య steamy affair scenes, passionate uncontrolled kisses లాంటి వర్ణనలు ఎక్కువగా ఉన్నాయిట. పి.వి తన ఖాళీ టైం లో రాత్రిళ్లు లాప్ టాప్ మీద కూర్చొని స్వయంగా టైప్ చేసిన మాన్యుస్క్రిప్ట్ ని తన మిత్రుడు నిఖిల్ చక్రవర్తికి , మిగతా సన్నిహిత మిత్రులకి, అభిప్రాయాల కోసం, విమర్శల కోసం చూపించటం జరిగిందిట. నిజానికి తను ప్రధానమంత్రి కాక పూర్వం , విదేశాంగ శాఖా మంత్రిగా 1990 లో తన అమెరికా పర్యటనలో ఎడిటోరియల్ కన్సల్టెన్సీ అభిప్రాయాలను కూడా తీసుకున్నారట. ఈ నవల ప్లాట్ ఒక కమర్షియల్, సెమీ ఆటోబయోగ్రఫికల్ పుస్తకంగా ప్రచురణ అవగలదా, నిలబడగలదా అని . 

ఈ లోపు పి.విగారు ప్రధానమంత్రి అవడం, తన ప్రాధాన్యతలు మారిపోవటం, ఈ మధ్యలో నిఖిల్ చక్రవర్తి తన దగ్గరున్న మాన్యుస్క్రిప్ట్ ని, సాగరికా ఘోష్ కి చూపించటం. అప్పుడే ఔట్ లుక్ మాగజైన్ విడుదలకి ఓపెనింగ్ సెన్సేషనల్ పీస్ గా, ఈ మాన్యుస్క్రిప్ట్ లోని హాట్-హాట్, జ్యూసీ భాగాలని వాడుకోవచ్చని సాగరికా ఘోష్ తలచి, ఆ భాగాల వర్ణణలతోఆవిడ తన ఆర్టికల్ ని మొదలుపెట్టి, ఆ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేసిందనీ తెలిసింది. 

దీన్ని పి.వి. తన మిత్రుడు నిఖిల్ పుస్తకాన్ని లీక్ చేసినట్లుగా భావించారట. A friend can be a journalist , but a journalist cannever be a friend అని ఉటంకించారట ఆ సందర్భంలో. కానీ ఈ ఘట్టం వారిద్దరిమధ్య అగాథాన్ని సృష్టించినట్లు లేదు. ఏమైతేనేం, చివరకి పుస్తకం తొందర్లోనే పబ్లిష్ చేయాలనీ, అందుకని తొందరగా ముగించాలని నిర్ణయం జరిగినట్లుంది. చివరికి తను ప్రధానమంత్రిగా దిగిపోయాక 1998 లో సాగరికా ఘోష్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ భాగాలని ఎందుకు తొలగించారు అని ఆమె అడిగినపుడు పి.వి బదులిస్తూ, "ముందుగా ఔట్ లుక్ మాగజైన్ కి నేను థాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు రాసిన ఆ ఆర్టీకల్ లో ఏ భాగాలని హైలైట్ చేసావో చూసినప్పుడు నాకు ఏవి తీసేయాలో తెలిసింది. డిస్క్రిప్టివ్ గా ఉన్న ఆ సీన్స్ వల్ల, పాఠకుడి కాన్సంట్రేషన్ వాటి మీదే ఉంటుందనీ, నేను చెప్పదలచుకున్న విషయాల మీదకి వెళ్లదని అర్ధమయింది అని చెప్పారు. ఒక మహాకావ్యంలో ఎన్నో అధ్యాయాలుంటాయి, వివిధ రసాలుంటాయి. నిజానికి ఒరిజినల్ గా పుస్తకం జీవితపు వివిధ దశల, పార్శ్వాల నుండి పాఠకుణ్ణి తీసుకెళ్తుంది. సుదీర్ఘ ప్రయాణంలో అనుభవమైన ఎన్నో అనుభూతులుంటాయి, వీటినే మనం రసాలంటాం. కాని నువ్వు కేవలం ఒక రసాన్నే హైలైట్ చేసావు. నా పుస్తకమ్ కేవలం దానికి సంబంధించిందే కాదు, మాస్ రైటర్ గా పేరు తెచ్చుకోవాలనీ పుస్తకం రాయలేదని" చెప్పారు. 

అది తెలిసాక ఔరా!! అనుకున్నాను. పబ్లిష్ అయిన వాటిలో ఉన్న అతికొద్ది డిటేయిల్స్ కే పైన చెప్పినట్లుగా మొదట్లో డిసప్పాయింట్ అయిన నేను, ఇహ ప్రధానమంత్రి గారు, ఆయన అఫయిర్ గురించి నోరూరించే డీటెయిల్స్ తో వర్ణిస్తూంటే, నిజంగానె పుస్తకాన్ని విసిరేసేవాణ్నేమో. 

అంటే ప్రధానమంత్రులు స్వచ్చమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలన్న అంచనాలేం నాకు లేవు, కాని చరిత్ర మీద ఆసక్తితో దేశ ప్రధానమంత్రి రాసిన పుస్తకం పిక్ చేసుకున్నప్పుడు, అకస్మాత్తుగా చందు సోంబాబు కనపడితే ఎలా ఉంటుంది మరి!

సరే, ఆ విషయాన్ని వదిలేస్తే, ఈ పుస్తకం చదువుతున్నప్పుడూ, చదివాక కూడా ఇందులో ఆనంద్ పాత్ర ఒక ఐడియల్, ప్రిన్సిపుల్డ్ కారక్టర్ గా ఉండిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. చుట్టూ దుర్గంధంతో నిండిపోయి, అందులో భాగమై, అదే ఊపిరై తప్ప ఉండలేని వాతావరణంలో ఆనంద్ మాత్రం స్వచ్చంగా, మల్లెపూవు లా ఉండిపోగలగటం రచయిత నిజాయితీని శంకింపచేసింది. అధికారం గురించీ, అధిష్టానం ఆశీర్వాదాల గురించీ, అధికారమే అంతిమ లక్ష్యం గా బురదలో జరుగుతున్న ఒక క్రీడగా వర్ణించినప్పుడు, ఆనంద్ ని ఆ క్రీడంటే ఆసక్తి లేని వ్యక్తిగా, పాత్రగా నిర్మించటంలో రచయితగా పి.వి గారి ఉద్దేశమేంటో తెలీదు కాని, వాస్తవం దానికి దూరంగా ఉందని పి.వి గారి రాజకీయపథాన్ని గమనించినవారెవరికైనా తెలుస్తుంది. ఇందువల్ల ఇదొక ఫాంటసీ, ఐడియలైజ్డ్  పాత్ర అన్న ఆర్గ్యుమెంట్ కి అవకాశం కలిగిస్తుంది.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకింకా ఊహ కూడా తెలీదు కాబట్టి, నాకు ముఖ్యమంత్రి పేరు లీలగా కోట్ల, స్పష్టంగా అయితే రామారావు కాలంనుంచీ మాత్రమే తెలుసు కాబట్టి, పి.వి గారు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన మీద జనాభిప్రాయం ఎలా ఉండేదో నాకు తెలీదు. కాని నాకు కాస్తో కూస్తో ప్రసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కేంద్రం, రాష్ట్రం అన్న విషయాలు తెలిసేప్పటికి ఆయన ఢిల్లీలో తప్ప, ఎప్పుడో కాని రాష్ట్రానికి వచ్చేవాడు కాడు కాబట్టి, నేను పెరుగుతుండగా పి.వి గారి గురించి ఎవరైనా కూడా .. " ఆ మన ఊరికి, మన జిల్లాకి ఏం చేసాడు, ఏమీ చేయలేదు " అన్న అభిప్రాయాన్నే నేనెక్కువ విన్నాను. 

ఆయన ఎంతగా అన్-పాపులరో చెప్పడానికి అతి పెద్ద , బలమైన ఉదాహరణ ఇది. 1984 లో ఇందిరాగాంధీ హత్యకి గురవటంతో వచ్చిన సానుభూతి పవనాలతో, కాంగ్రెస్ భారత్ చరిత్రలో కనీవిని ఎరుగని, నెహ్రూకి సైతం రాని మెజారిటీతో 416 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంత బలమైన వేవ్ లో, అప్పటికి అంత ఉనికి లేని, అనామకంగా ఉన్న బిజెపి పార్టీకి దేశం మొత్తం మీద రెండే రెండు ఎమ్. పి సీట్లలో విజయం లభించింది. ఆ రెండింటిలో ఊరూపేరూ పెద్దగా తెలీని బిజెపి అభ్యర్థి జంగారెడ్డి ఒకరు. ఇప్పటికీ ఆయన పేరు తెలిని వారు చాలామంది. ఇంతకీ జంగారెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచిందెవరి మీదో తెలుసా? పి.వి.నరసింహారావు గారి మీద!!

ఈ ప్రమాదాన్ని పి.వి. ముందే ఊహించారు, అందుకే అదే ఎన్నికల్లో సేఫ్-సీట్ అయిన రామ్టెక్ నుంచి కూడా పోటీ చేసారు. అక్కడ గెలిచి కేంద్రమంత్రి పదవిని కాపాడుకున్నారు.


ఎనీవే, కేవలం ఇందిరాగాంధీకి ఆప్తుడిగా, నమ్మినబంటుగా, ఆంతరంగికుడిగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోని జీవితాంతం రాజకీయాలలో, పదవులలో ఉన్న పి.వి. గారు.. సెమీ బయోగ్రఫి లాంటి పుస్తకంలో ఆనంద్ ని పదవులంటే ఆసక్తి లేని, పదవుల వెంట పడని, కేవలం తన తెలివితేటలకి రివార్డ్ గా మాత్రమే ఆ పదవులు వచ్చినట్లుగా చిత్రీకరించి, తన ఐడియల్-హి గా "ఉంచేయటం" ఆశ్చర్యాన్ని కలిగించి, తన వర్షన్ మీద నిజాయితీతో ఒక అభిప్రాయానికి రాలేని పరిస్థితిని కల్పించింది.

కానీ అరుణ తో తన పరిచయాన్ని పబ్లిష్ అయిన వర్షన్ లో ఆల్మోస్ట్-ప్లెటోనిక్, అందీ-అందనట్లు గా ఉంచేసినప్పటికీ, ఆయన ధైర్యాన్నీ, నిజాయితీని ఎన్నో విధాలుగా కొనియాడక తప్పదు. ముఖ్యంగా సాంప్రదాయ భారతదేశం లో ఒక ప్రధానమంత్రి అంత ధైర్యంగా రాసుకోవటం ఊహకందని విషయం! అయితే అదే సమయంలో నీలం సంజీవరెడ్డి షేడ్స్ తో రూపొందిన మహేంద్రనాథ్ ని ఒక సీరియల్ ఫోర్నికేటర్ గా, సెక్స్ అర్జ్ ని ఒక ఇచ్ కన్నా సాధారణమైన నీడ్ గా కన్సిడర్ గా చేసే పర్సన్ గా, బ్రహ్మానందరెడ్డి పాత్రగా రూపొందిన చౌదరిని ప్రాస్టిట్యూట్స్ తో గడిపే వ్యక్తిగా, గాంబ్లింగ్ చేసే ఒక రూథ్ లెస్ వ్యక్తిగా తీర్చిదిద్దటం గమనించాల్సిన విషయం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆనంద్ పాత్ర ఆదర్శాలతో ఉట్టిపడుతున్న పాత్ర, మిగతావన్నీ మురికి పాత్రలుగా చిత్రీకరించిన వాతావరణం, నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. 

((అయితే ఈ పుస్తకమూ, ఇంకా వేరే కొన్ని రిలేటెడ్ ఇంటర్వ్యూస్, ఆర్టికల్స్ చదివిన తరువాత నాకు ఏర్పడిన అభిప్రాయమేంటంటే, పి.వి. గారిలో తనీ పుస్తకంలో రాసుకున్నట్లుగానే ఇద్దరు మనుషులు తనతో ప్రయాణం చేసారు. ఒకరు తనెన్నుకున్న వృత్తిలో రాణించటానికీ, ముందు వరసలో ఉండటానికి తన బలాలకీ-బలహీనతలకీ తగినట్లుగా ఏఏ పనులూ, ఎత్తుగడలూ, వ్యూహాలూ, నక్కజిత్తులూ అవలంభించాలో అవన్నీ చివరివరకీ చేసుకుంటూ వచ్చారు. ఇంకొకరు( The other-half ) ఇంటలెక్చువల్ గా చరిత్రనీ, దేశగమనాన్నీ, దేశ పరిస్థితులనీ, సమస్యలనీ, ఫిలాసఫీని, నాడినీ, వాటికి సమస్యలని, పరిష్కారాలనీ నిరంతరంగా అధ్యయనం చేస్తూ నమోదు చేసుకుంటూ వచ్చారు. ఈ మనిషి అధికారాన్ని అంతిమటార్గెట్ గా, కుర్చీని తన ఆస్థినీ, బలగాన్నీ పెంచుకునే వ్యక్తిగా కాక, పదవిలోకి వచ్చాక నిర్వర్తించవలసిన భాధ్యతలని, సమస్యల పరిష్కారాలనీ కూలంకశంగా ఆల్మోస్ట్ అకడమషియన్ లా, బ్యూరోక్రట్ లా స్టడీ చేస్తూ వచ్చారు. ఈ ఆల్టర్నేటివ్ స్టడీ ఆయన రాష్ట్రంలో, దేశంలో అత్యున్నతపదవిలోకి వచ్చిన రెండు సార్లు కూడా, ఏ రాజీవ్ గాంధీ లానో ఆన్-ద-జాబ్-ట్రెయినింగ్ అవసరం లేకుండా చేసింది. తను చూసిన పేదరికాన్ని అధ్యయనం చేసి సోషలిజాన్ని నమ్మి, నెహ్రూ విజన్ నీ, ఇంటలెక్ట్ నీ విశ్వసించిన కాలంలో భూసంస్కరణల ఒక మచ్-నీడేడ్ సొల్యూషన్ గా ఎంతో బలంగా నమ్మి, తనకి ముఖ్యమంత్రి పదవి రాగానే మిగతా వారిలా తాత్సారం చేయకుండా, వాటిని అంతే బలంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడం ఆ స్టడీ ఫలితమే. అదే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేప్పటికి గడచిన సుదీర్ఘకాలంలో దేశసమస్యలకి లైసెన్స్ రాజ్ ని నిర్మూలించకతప్పదనీ, ఫ్రీ మార్కెట్ ఎకానమీకి తలుపులు తీయక తప్పదనీ, సోవియట్ యూనియన్ లేకపొవటంతొ సమూలంగా మారిపోయిన ఇంటర్నేషనల్ లాండ్ స్కేప్ లో భారత్ తనకంటూ కొత్తగా ఒక పాత్రని స్వంతగా రూపొందించుకొక తప్పదనీ చాలా తొందరగా అర్ధం చేసుకోవటమే కాక, ఆ వైపు అత్యంత వేగంగా, ధృఢంగా, ఒంటరిగా అడుగులు వేస్తూ, వేపించారని కూడా తెలుస్తోంది. తన స్వంత ఆస్థి కోసం కాకపోయినా, ప్రభుత్వాన్ని నిలుపుకోవటానికి చేయవలసి వచ్చిన బురదపనులలో భాగంగా వచ్చిన అవినీతి ఆరోపణలు, ఇచ్చిన కోర్టు తీర్పులూ, స్వయానా ఆయనకి ఉన్న ఇడియో-సింక్రసీస్ అయిన కొన్ని స్టుపిడ్ నమ్మకాలు చంద్రస్వామిలాంటి నికృష్టులని ఇన్నర్ టీమ్ లో భాగం చేసి నడిపిన రాజకీయాలు, ఆయన మీద మాయని మచ్చని వేసాయి. ఈ నా uneducated, uninformed opinions ని ఇంతటితో ఆపడం మంచిదనుకుంటాను :) )

అయితే ఆనంద్ ముఖ్యమంత్రి అవడమూ, తదుపరి తను ఆ పీఠం నుంచి దిగిపోవటంతో ముగిసిన ఈ పుస్తకానికి రెండవ వాల్యూమ్ ని పి.వి గారు ప్లాన్ చేసారు. 

కానీ, ఇంతలో అయోధ్య ఘట్టం పి.వి గారి లెగసీ మీద శాశ్వతంగా నల్లమచ్చ వేస్తూన్న/వేసిన పరిణామంలో తన వైపు స్టోరీ ని వినిపించడం కోసమై, అయోధ్య పుస్తకం మీద కాన్సంట్రేట్ చేసారట, అందుకని రెండవ వ్యాల్యూమ్ వెనకపడిందిట.

ఈ లోపల పి.విగారు చనిపోకపోయి ఉంటే, రెండవ వ్యాల్యూమ్ లో పి.వి. గారే స్వయంగా చెప్పినట్లుగా కవర్ చేయాలనుకున్న ఇందిరాగాంధీ ఎంతో పాపులర్ అయిన బంగ్లాదేశ్ అవతరణ అనంతర పరిస్థితిలో కూడా తను ఎమర్జెన్సీ విధించేంతగా ఎందుకు ఆలోచించిందో, ఎలాంటి పరిస్థితులు ఆమెని ప్రభావితం చేసి ఉండవచ్చో లాంటి విషయాలూ, అలాగే బహుశా తన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోని పరిస్థితులూ, తన నిర్ణయాల గురించి రాసి ఉండేవారేమో, అవన్నీ మనం చదువుకునే అవకాశం ఉండి ఉండేదేమో.

మరచిపోయాను.. ఈ పుస్తకం ఇంగ్లీష్ లో నేను చదవలేదు, తెలుగులో చదివాను. కాబట్టి అనువాదం ఎలా ఉందో ఆబ్జక్టివ్ గా చెప్పలేకపోయినప్పటికీ, కల్లూరి భాస్కరం గారి అనువాదం బాగుందని చెప్పగలను.

Friday, 27 December 2013

EMPIRE of the SUMMER MOON by S.C.GWYNNE

Posted by Kumar N on 12/27/2013 01:08:00 am with 1 comment
మరీచిక గారూ, మీ కామెంట్ చూసానండీ. థాంక్యూ.

చెరోకీ లు, Sioux లు పెద్ద ట్రైబ్స్ అండీ. కానీ వీటన్నిటికన్నా వీరోచితమైన ట్రైబ్ Comanche అని ఇంకోటి ఉంది. అది మీరు టెక్సాస్ వైపు వెళ్తూంటే వస్తుందెక్కువగా. I-35 south మీద అలా డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు Comanche Land అని బోర్డులు కూడా కనపడతాయి. 

కొంతకాలం క్రితం ఈ పుస్తకం గురించి g+ లో మెన్షన్ చేసాను, మీకు ఇంట్రస్ట్ ఉంటే కనక, ఈ పుస్తకం చదవండి, ఫాసినేటింగ్ గా ఉంటుంది, కిందపెట్టనీయదు. It's non-fiction, and the Quanah's story is real. 

అడిగారు కదా రాయమని.. మీకోసం వీలయినంత క్లుప్తంగా. 

పుస్తకం బాగా ఆసక్తికరంగా రాసాడు రచయిత. పెద్ద నేపథ్యాన్ని, ఒక చిక్కుముడయిన పర్సనల్ స్టోరీ తో మొదలుపెట్టి, దాన్ని విప్పదీస్తూ పోతూ, అందులో భాగంగా మిగతా హిస్టరీ అంతా మనకి చెపుతాడు. ఆ దారెంట మనం పోతున్నకొద్దీ మనకి చాలా విషయాలు తెలుస్తాయి. 
 
నేటివ్ అమెరికన్స్ అని చాలా మంది మాట్లాడుతారే తప్ప, అసలు వాళ్లెలా వచ్చారు ఈ కాంటినెంట్ మీదకి అంటే చాలా మంది గుడ్లు తేలేస్తారు. మీకు దాని గురించి తెలుసుకోవాలంటే చాలానే ఉన్నాయి పుస్తకాలు. అసలు మనిషి ఇక్కడికెలా వచ్చ్చాడూ, వచ్చిన తరవాత భూభాగం విడిపోయి ఎలా వేరుపడిపోయి కొన్ని వేల సంవత్సరాలు పశ్చిమగోళానికీ, తూర్పుగోళానికీ ఒకరి ఉనికి ఇంకొకరికి ఎలా తెలవకుండా ఉండిపోయిందీ, అభిముఖ గోళార్థాలలో మనిషి పరిణామదశలు భిన్నదిశలలో ఎందుకు ప్రయాణించాయి, వాటికి కారణాలేంటి అన్న సబ్జక్ట్ ని కవర్ చేసిన చాలా బుక్స్ లో Great Divide పుస్తకం ఒకటి. 
 
సరే పుస్తకం Quanah Parker అనే నేటివ్ అమెరికన్ వీరోచిత నాయకుడి జీవితకథ నేపథ్యంలో సాగుతుంది. అతని లాస్ట్ నేమ్ Parker, తన అమ్మ అయిన Cynthia Ann Parker దగ్గర్నుంచి వచ్చింది. అదేమిటి? నేటివ్ అమెరికన్ కదా, Cynthia పేరు అలా లేదే అన్న ప్రశ్న మదిలో రాక మానదు. 

కథ అక్కడే మొదలవుతుంది. 
***

నందరికీ తెలిసిన విషయమే, యూరప్ నుంచి అట్లాంటిక్ మీదుగా వచ్చిన వైట్ సెటిలర్స్ అంతిమ లక్ష్యం పసిఫిక్ దాకా భూభాగాన్ని స్వంతం చేసుకోవటం. మిగతా కారణాలతో పాటూ, నేటివ్ అమెరికన్స్ తెగల prairie lands మీదుగా ప్రయాణించటమనేది ప్రాణాంతకమైనదే. కానీ యూరోపియన్ మనుషులు తమ ఒప్పందాలని ఎప్పుడూ గౌరవించలేదు, ఎల్లప్పుడూ వెస్ట్ వైపు బౌండరీస్ ని పుష్ చేసుకుంటేనే వెళ్లారు. ఇంగ్లీష్ బాషలోఅంత ప్రావీణ్యం లేని Quanah వైట్ మాన్ ఇండియన్స్ ని ఎలా పక్కకి నెట్టుకుంటూ పోయాడన్నది తన మిత్రునికి demonstrate చేసి చూపిస్తాడు ఈ పుస్తకంలో ఒకచోట. "తన మిత్రుణ్ణి ఒక బెంచ్ మీద కూర్చోమని చెప్పి, తను కూడా పక్కకు వెళ్లి దగ్గరగా కూర్చోని, మిత్రుణ్ణి కాస్త పక్కకు జరగమంటాడు. అతను జరిగాక, మళ్లీ దగ్గరకెళ్లి కూర్చోని, ఇంకాస్త జరగమంటాడు. జరిగాక మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేసి చివరకి బెంచ్ మీదనుంచి పక్కకు తోసేస్తాడు . వైట్ మాన్ మమ్మల్ని ఇలా మా లాండ్ మీదనుంచి మమ్మల్ని తరిమేసాడు అని చెపుతాడు"

పైకి అతి సాధారణంగా కనిపించే ఈ ఉదంతం వెనక ప్రపంచ చరిత్ర మూలాలు దాగున్నాయనిపించకమానదు. 

ఇరువైపులా ఎన్నో హ్యూమన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో పాటూ, ఇరువర్గాల వారూ క్రూయాలిటీకి పరాకాష్ట అయిన పద్దతులని ఎలా అవలంభించారో, యూరోపియన్స్ కీ, నేటివ్ అమెరికన్స్ కీ మధ్య దాదాపు 1870-1875 దాకా జరిగిన రెండొందల యాభై సంవత్సరాల రక్తచరిత్ర ఎలా సాగిందో మనకి అవగాహనలొకి వస్తుంది.

అన్నేళ్ళ ప్రచ్చన్న పరోక్ష యుద్దం సాగినప్పటికీ, 1864 లో Custer చేపట్టిన నరహంతకచర్యల రోజుల్లో కూడా నేటివ్ అమెరికన్స్ తెగలని సమూలంగా నాశనం చేద్దామన్న కోరిక యూరోపియన్స్ కి లేకుండింది. కానీ టెక్సాస్ ప్రాంతంలో తమకి కంటగింపుగా మారిన Comanches ని నిర్మూలించేయమన్న October 3, 1871 order తో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

ఏ US Soldier అప్పటివరకీ వెళ్లని వెస్ట్ టెక్సాస్ లోకి దళాలు భారీఎత్తున దిగుతాయి. WestPoint నుంచి 1862 లో గ్రాడ్యుయేట్ అయ్యి, ఎన్నో వార్స్ లో గాయపడి తన కుడిచేయి వేళ్లని కోల్పోయిన General Mackenzie, విశాలమైన prairie buffalo lands లోని Comanche ఇండియన్స్ తో ఎలా యుద్దం చేయాలో US army కి నేర్పిస్తాడు. అప్పటివరకి ఇండియన్స్ దే పైచేయి, వెస్ట్ వైపు మూవ్ అయిన ప్రతిసారీ ఇండియన్స్ అమెరికన్స్ ని తిప్పికొట్టారు. భారీ నష్టాలతో అమెరికన్స్ మొట్టమొదటిసారిగా తమ భూభాగాలని విడచి, తూర్పువైపు తిరుగుముఖం పట్టారు. Civil War ముగిసిన ఆరుసంవత్సరాలకి కూడా వెస్టర్న్ భూభాగమంతా శవాలతో, రక్తాలతో నిండిపోయి ఒక రూల్-ఆఫ్-లా లేక, ఇండియన్స్ ముఖ్యంగా Comanches వాళ్ల ఇష్టానుసారం రాజ్యమేలుతారు. సివిల్ వార్ లొ నెగ్గిన యూనియన్ దళాలకి మిగిలిపోయిన ఈ చివరి ఇండియన్ దళాలు చేస్తున్న మారణకాండా, పోరాటం నిద్రపట్టనివ్వదు. ఈ దశలో Mackenzie, కొమాంచీ దళాలని ప్రధాన లక్ష్యంగా ఎన్నుకుంటాడు. 

కొమాంచీలు అమెరికన్స్ ని వెస్ట్ వైపు రాకుండా నిలవచేయటమే కాదు, స్పానిష్ ఎంపైర్ ని సౌత్ అమెరికా నుంచి ఉత్తరం వైపుకు రానీయకుండా కూడా అడ్డుకుంటారు. వంద సంవత్సరాల యూరోపియన్స్ అప్రతిహత వెస్ట్ వార్డ్ ఆక్రమణని చరిత్రలొ మొట్టమొదటిసారిగా కొమాంచీలు ఆపగలగటమే కాక, అమెరికన్స్ తమ సెటిల్మెంట్స్ ని అన్నీ వదులుకోని దాదాపు వందమైళ్లు తూర్పువైపు పారిపోయేలా చేయగలుగుతారు.

విచిత్రమేమిటంటే, కొమాంచీల దిగ్భ్రాంతికరమయిన విజయాలన్నీ అమెరికాలో టెక్నాలజికల్ గా ఎన్నో విప్లవాత్మకమయిన మార్పులు సంభవించిన 1869 Rail-Road కాలంలోనే జరిగాయి. Trains వచ్చాక ఇండస్ట్రియలైజ్ అయిన నార్త్-ఈస్ట్ మార్కెట్స్ లో, చికాగో మార్కెట్స్ లో తమ Cattle కి మంచి ధరలు లభించటంతో రైళ్లన్నీ Cattle తో కిక్కిరిసిన కాలమది. Rails తో పాటూ, బఫలో-హంటర్స్ దిగారు. కొత్తగా వచ్చిన 0.5 కాలిబర్ రైఫిల్స్ తో బఫెలోస్ ని వేటాడ్డం సులభమయింది. కొన్ని వందల, వేల ఏళ్లు అమెరికన్ భూభాగాన్నేలిన బఫెలో 1871 లో ఇంకా తిరుగుతూనే ఉంది. 
 
ఆ సంవత్సరంలోనే కాన్సాస్ లో , యాభైమైళ్ల పొడుగూ, ఇరవైఐదు మైళ్ల వెడల్పుతో నలభై లక్షల బఫెలో గుంపు హంటర్స్ కంటపడనేపడింది. మారణకాండ మొదలయింది. మానవ జాతి చరిత్రలో వెచ్చటి-నెత్తురున్న జంతువులని ఇంత భారీ ఎత్తున ఊచకోత కోయటం మునుపెన్నడూ జరిగుండదు. 1868-1881 కాలంలో, ఒక్క కాన్సాస్ లొనే ముప్పైఒక్క లక్షల బఫెలో ఎముకలు ఫర్టిలైజర్ కోసం అమ్మారంటే బఫెలో ల వేట ఎంతపెద్దఎత్తున సాగిందో అర్ధం చేసుకోవచ్ఛు. 

ఇదే సమయంలో Mackenzie దళాలు దిగాయి. ఈస్ట్ నుంచి, వెస్ట్ కి వేసిన Rail-Road దేశాన్ని ఒకేతాను కింద మార్చింది. Nation అభివృద్ది పథంలో దూసుకుపోతోంది. కానీ ఒకే ఒక్క అడ్డంకి. Great Plains ప్రాంతంలో యుద్దవీరులయిన ఇండియన్ ట్రైబ్స్. ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ లో, ప్రిమిటివ్ గా బతుకుతూ, ఆటవికంగా ఊచకోత కోసే కొమాంచీ ట్రైబ్స్ ని నిర్మూలిస్తే కానీ, వెస్ట్ వైపు మైగ్రేషన్స్ శాంతిగా జరగవు. 

Mackenzie కొమాంచీల కోర్-గ్రూప్ అయిన Quahadis కోసం అన్వేషణ మొదలుపెడతాడు. Nomads అయిన ఈ ట్రైబ్స్ ఆచూకీ పట్టుకోవటం అంత సులభం కాదు. కానీ తొందర్లోనే వారి ఆనవాళ్లు కనపడతాయి. కానీ Mackenzie కీ కానీ, తన సైన్యానికి కానీ Quanah ఎవరో అప్పటివరకీ తెలీదు. వారికే కాదు, Quanah ఎవరో, ఎక్కడుంటాడో, అతని వయసెంతో ఇలాంటి విషయాలు వైట్ మెన్ కే కాదు, ఇతర ఇండియన్ తెగలకి సైతం తెలీదు. Mackenzie, Quanah లు ఇద్దరూ 1870 లలో జరిగిన యుద్దాలలో పేరు గడించిన వారే. నిజానికి Mackenzie దళాలతో తలపడేనాటికి, Quanah కేవలం 23 ఏళ్ల ప్రాయం వాడే, కానీ శత్రువులపాలిటి క్రూరుడనీ, ఎంతో తెలివికలవాడనీ, యుద్దరంగంలో జిత్తులమారి అనీ, భయమంటే ఏంటో తెలీని వీరుడని అతనికి పేరు.

అయితే Quanah గురించి చాలామందికి తెలీని ఇంకో విషయం కూడా ఉంది. అతను హాఫ్ - బ్రీడ్. ఇండియన్ చీఫ్ కీ, వైట్ వుమన్ కి పుట్టిన బిడ్డ అతడు. ఇదేమి అంత అరుదైన విషయమేమీ కాదు. కొమాంచీ యుద్ద వీరులు, మిగతా ఇండియన్ తెగల స్త్రీలనే కాకుండా, ఇంగ్లీష్, స్పానిష్, మెక్సికన్, అమెరికన్ స్త్రీలని బంధీలుగా తెచ్చి వారితో పిల్లల్ని కనటం వందల సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. 

కానీ ఇప్పటివరకి అలాంటి సంతానం ఒక ప్రముఖమైన ఇండియన్ చీఫ్ గా ఎదగటం చరిత్రలో రికార్డు అయి లేదు. 1871 లో Mackenzie, Quanah కోసం వేట మొదలెట్టేసరికి, Quanah తల్లి చాలా ప్రాచుర్యం పొందిన యుద్దఖైదీ. ఆమె న్యూయార్క్, లండన్ నగరాలలో The White Squaw గా పేరొందింది. తొమ్మిదేళ్ల వయసులోనే ఇండియన్ తెగల దాడిలొ బంధీగా తరలించబడిన ఆ పాప, ఇండియన్స్ తోనే పెరిగి పెద్దదయ్యి, తిరిగి తన వైట్ ఫ్యామిలీతో కలవటానికి ఎన్నో అవకాశాలొచ్చినప్పటికి తిరస్కరించిన వైట్ వుమన్ గా ఆమె అందరికీ సుపరిచితమే. 

అప్పటివరకీ యూరోపియన్స్ నమ్మకం వేరే. అవకాశమంటూ ఉన్నప్పుడు విచక్షణాజ్ణానమున్న ఏ వ్యక్తయినా, ఒక మొరటు, రక్తపాత, నైతికత విలువలేనీ లేని ఆటవిక సమూహాన్ని తిరస్కరించి, ఆధునికంగా, పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన క్రిస్టియన్ యూరోపియన్ కల్చర్ వైపు మొగ్గుచూపుతారన్న యూరో-సెంట్రిక్ నమ్మకాన్ని సింథియా పార్కర్ దెబ్బతీసింది.

సింథియా టెక్సాస్ లోని ప్రముఖమయిన కుటుంబానికి చెందింది. ఆమె కుటుంబంలో టెక్సాస్ రేంజర్ కెప్టెన్స్, టెక్సాస్ లో మొదటగా చర్చ్ ని నిర్మించిన ప్రసిద్ది చెందిన బాప్టిస్టులూ ఉన్నారు. 

1836 లో Parker's Fort(ఈ రోజునున్న Dallas కి 90 మైళ్ల దూరం) మీద కొమాంచీలు జరిపిన మెరుపుదాడిలో కిడ్నాప్ కి గురవుతుంది. అతి తొందర్లోనే తన మాతృభాషయిన ఇంగ్లీష్ ని మర్చిపోయి, ఇండియన్ ఆచారాలనీ,సంచార జీవన శైలినీ నేర్చుకుంటుంది. ప్రముఖ ఇండియన్ వార్ చీఫ్ అయిన Peta Nocona ని పెళ్లి చేసుకొని తనతో ముగ్గురు పిల్లల్ని కంటుంది. అందులో Quanah పెద్దవాడు. 

Mackenzie కి సింథియా పార్కర్ ఎవరో తెలుసు. నిజానికి ఆకాలంలో టెక్సాస్ సరిహద్దుల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ వారికి తెలీనిదల్లా సింథియా రక్తం Quanah నరాల్లొ ప్రవహిస్తోందని 1875 వరకీ కూడా వారికీ తెలీదు. తెలిసిందల్లా 1865 తర్వాత అమెరికన్ దళాలు అత్యంత పెద్ద ఎత్తున జరిపిన గాలింపుల లక్ష్యం Quanah ఒక్కడే అని. 

మొదట్లో Mackenzie దళాలు భారీ నష్టాలని చూస్తాయి. Quanah ఆచూకీలూ, ఆనవాళ్లు ఏవీ లభించక కనిపించిన, అనిపించిన క్లూ ల వెంటపడి పోతుంటారు. నీళ్లకి సోర్స్ దొరకదు, బఫెలోలు దొర్లే మురికిగుంటలు తప్ప మరోటి కన్పించవు. rodents, buffalos తో నిండి ఉన్న అనంతమైన great plains లో, gypsum తో నిండి ఉండి తాగటానికి అనువుగా లేని నీటితో, దారి తెలీని దుర్గమమైన ప్రాంతాలమధ్య , గుర్రాలమీద స్వారీ నేర్చిన ఇండియన్ తెగలదే పైచేయి అవుతుంది. 

Mackenzie దళాలకి Quanah ఉనికి సైతం కానరాదు, కానీ Mackenzie Cavalry ఆనవాళ్ళే కాదు, Mackanzie ఎప్పుడు ఏం చేస్తున్నాడన్నది Quanah కి స్పష్టంగానే తెలిసిపోయేది. ఈ సమయంలో Mackenzie camp మీద జరిపిన దాడిలో Quanah ప్రాణనష్టం కలిగించటమే కాక, భారీ ఎత్తున Mackenzie దళపు గుర్రాలన్నిటినీ అపహరించుకోని పోతాడు. 1871 లో వెస్ట్ టెక్సాస్ లో గుర్రాన్ని కోల్పోవటమంటే ప్రాణాన్ని కోల్పోవటమే. అది పురాతనమైన ఇండియన్ టెక్నిక్. ఎత్తైన మైదానాల్లో వైట్ మెన్ దగ్గర్నుంచి, గుర్రాన్ని లాగేసుకుంటే చాలు. వందలమైళ్ల దుర్లభమైన బీడుని దాటేసే లోపల వైట్ మాన్ ఆకలితో, దప్పికతో మరణించటం ఖాయమన్నది ఇండియన్స్ కి బాగా తెలిసిన విషయమే. 

అర్ధరాత్రి జరిపిన ఈ దాడితో Quanah, ఈ ప్రాంతంలో మమ్మల్ని ఓడించటం మీతరం కాదన్న స్పష్టమైన మెసేజ్, అమెరికన్ దళాలకి పంపాడు.

ఈ దాడితో నాలుగు సంవత్సరాల రక్తపాతయుద్దం మొదలయింది. Battle of Blanco Canyon తో అమెరికా మొట్టమొదటిసారిగా Quanah ని చూడటం సంభవిస్తుంది. Congressional medal of honor పొందిన Captain Carter మాటల్లో Quanah ని చూద్దాం.

"A large and powerfully built chief led the bunch, on a coal black racing pony. Leaning forward upon his mane, his heels nervously working in the animal’s side, with six-shooter poised in the air, he seemed the incarnation of savage, brutal joy. His face was smeared with black warpaint, which gave his features a satanic look. . . . A full-length headdress or war bonnet of eagle’s feathers, spreading out as he rode, and descending from his forehead, over head and back, to his pony’s tail, almost swept the ground. Large brass hoops were in his ears; he was naked to the waist, wearing simply leggings, moccasins and a breechclout. A necklace of beare’s claws hung about his neck. . . . Bells jingled as he rode at headlong speed, followed by the leading warriors, all eager to outstrip him in the race. It was Quanah, principal warchief of the Qua-ha-das". 

***
అసలు సింథియా ఎవరూ, ఎందుకని ఆమె తన ఫ్యామిలీ దగ్గరికి రావటానికి తిరస్కరించిందీ, చివరకి సింథియా ఎక్కడికి చేరుకుంటుందీ,తన జీవితం హాప్పీ ఎండింగ్ ని చూస్తుందా, అన్-హాప్పీ పర్సన్ గా చనిపోతుందా, అసలు కొమాంచీలు అమెరికా భూభాగమ్మీదకి ఎప్పుడొచ్చారూ, ఒక ట్రైబ్స్ దశనుండి పెద్ద భూభాగాన్ని శాసించే దశకి ఎంతో త్వరగా కొమాంచీలు ఎలా చేరుకున్నారూ, ఇండియన్ తెగల ఆధిక్యానికి అమెరికా భూభాగమ్మీద లేని, స్పెయిన్ ఆక్రమణదారుల ద్వారా అమెరికా ఖండానికి చేరిన నాలుగు కాళ్ల జంతువయిన "గుర్రం " ఎంత ప్రముఖ పాత్ర వహించిందీ, ఏ రకమయిన ఆచ్ఛాదనలేకుండా గుర్రపు స్వారీని ఎలా నేర్చుకున్నారూ, దూరప్రాంతాలని వేగంగా చేరుకోలేని తెగలకి, గుర్రపు వేగం బఫెలో హంటింగ్ లో ఎంత దోహదం చేసిందీ, తద్వారా మొట్టమొదటిసారిగా ఆహారం సమృద్దిగా లభించటమే కాక, యుద్దరంగంలో గుర్రం వల్ల ఇండియన్ తెగలకి లభించిన తిరుగులేని ఆధిక్యతా, ఇవే కాదు, కథ జరిగిన కాలంలో వచ్చే అమెరికన్ - మెక్సికో వార్ గురించీ, టెక్సాస్ అమెరికాలో కలసిపోయిన విశేషాల గురించీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

అంతే కాదు, సింథియా పార్కర్ జీవితాన్ని ఫాలో అవుతూ పోతుంటే కొన్ని చోట్ల గుండె తరుక్కుపోతుంది. సింథియా తొందర్లోనే తన నేపథ్యాన్నీ, గతాన్నీ మర్చిపోవచ్చు గాక, కానీ తన కుటుంబం మాత్రం మర్చిపోదు. సింథియా అంకుల్ James 8 సంవత్సరాలు తనకోసం గాలిస్తూనే ఉంటాడు. 

Quanah చివరకి Teddy Roosevelt అంతటి నాయకుణ్ని కలవటం గురించీ, అమ్మ సింథియా సమాధి స్థలం కోసం సాగించిన అన్వేషణ గురించీ, తన వీరోచిత గాథల గురించీ, తనూ, తన తండ్రి క్రూరమయిన హత్యల గురించీ తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవండి. 

October 25, 1910 న Dallas Morning News paper లో వచ్చిన న్యూస్ స్టోరీతో ఈ బ్లాగ్-పోస్ట్ ముగిస్తాను.

" కన్వెన్షన్ హాల్ లో ప్రతి సీట్ కూడా నిండిపోయింది. ముఖ్య అతిథీ, కొమాంచీ చీఫ్ అయిన Quanah Parker సెంట్రల్ ఆకర్షణగా నిలచాడు. తన పన్నెండేళ్ల Gussie తో Quanah హాజరయ్యాడు. ఇద్దరూ కూడా warbonnets, buckskins, moccasins ధరించారు. అతని ఇంగ్లీష్ పదాలు కొన్నిసార్లు అర్ధం చేసుకోవటం కష్టమయినప్పటికీ స్పష్టమయిన గొంతుతో హాల్ లో చివరి వరసలో కూర్చున్న వారికి సైతం వినపడేలా, ప్రతిధ్వనించే విలక్షణమైన గొంతుతో అతను ప్రసంగించాడు."Ladies and gentleman" he began, " I used to be a bad man. Now I am a citizen of United States. I pay taxes same as you people do. We are the same people now". He spoke of his mother................."