Sunday 4 January 2015

చిన్నప్పుడెప్పుడో కథ చదువుకున్నాం గుర్తుందా?

యమధర్మరాజు తన కోసం భూమ్మీదకొచ్చినప్పుడు తప్పించుకునేందుకై, ఒక ప్రఖ్యాత నైపుణ్యుడైన శిల్పి తనలాంటి ఏడు విగ్రహాలని తయారు చేసి వాటి మధ్యలో తనూ ఒక శిలలా నించున్నాడనీ, వాటిని చూసిన యముడికి అందులో ఎవరు సజీవమైన మనిషో, ఏది నిర్జీవమైన శిలయో గుర్తుపట్టలేక నీరుగారిపోయాడనీ, పరాజితుడై పోలేక చిట్టచివరకి ఒక ఉపాయం తట్టి అతిశయాలంకారలతో శిల్పిని పొగిడి ఔరా ఈ శిల్పి ఎవరని ఆశ్చర్యపోతే, పొగడ్తలు తలకెక్కిన శిల్పి , అది నేనే అని ముందుకొచ్చి నించున్నాడనీ తద్వారా తనకి యమపాశం వాత పడిందనీ.

నీతి మనందరకీ తెలిసిందే. పొగడ్తలకి గుండెపొంగని, కొండొకచో మెదడు వాయని మనిషి ఉండడని.

అయితే ఇదే కథ దీనికి వ్యతిరేకంగా జరిగి ఉంటే?

పొగడ్తలకి శిల్పి లొంగిపోకుండా, యమధర్మరాజే ఆ శిల్పకళ కి దాసోహమయి ఉంటే?!!

***

“జీవకళ ఉట్టిపడుతోంది”,
“జీవం తొణికసలాడుతోంది”

గొప్ప కళాకారుల సృష్టి గురించి ఇలాంటి పోలికలూ, పొగడ్తలూ అక్కడక్కడా, అప్పుడప్పుడూ వింటూంటాం .

ఒక అద్భుత సౌందర్యవంతమైన విగ్రహాన్ని చెక్కి, అది జీవకళ ఉట్టిపడేలా తయారు చేసే పనితనం గొప్పదే. అదో గొప్ప లోకమే. కానీ ఈ లోకంలో శిల్పి చేతిలో ముడిసరుకు రాయి మాత్రమే. అహర్నిశలూ అభ్యాసం ద్వారా సాధించిన నైపుణ్యంతో చెక్కిన ఆ ముడిసరుకుకి జీవకళ అబ్బుతుంది.

Stone takes a lively form here.

కానీ ఆ లోకాన్ని దాటి వెళ్తే కొన్ని ఊర్ధ్వలోకాలుంటాయి. అందులో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది.

ఆ లోకాల్లో బ్రహ్మ ఉంటాడు. ఆయన చేతిలో ఉండే ముడిసరుకు ‘లైఫ్’. దాంతో ఏం చేసినా సజీవమైన సృష్టే జరుగుతుంది. లైవ్లీ, లవ్లీ లకి అవతలి లోకం అది. లైఫ్ సర్వాంతర్యామి అయిన లోకం.

Life manifests into many forms here.

***

కథ లో ఏమయింది ఇంతకీ?

ముందు శిల్పి తెలివితేటలకి ముచ్చటనొందిన యముడు, ఆ పై ఆ శిల్పకళానైపుణ్యం తనని స్థిరచిత్తువుని చేసిన క్షణాలు గుర్తుతెచ్చుకున్నాడు.

మహిషం దిగి ఆ శిల్పాల ముందు నిలపడి మరోసారి గమనిస్తూ, దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. గుండెలో అనాదిగా దాగున్న చిన్న బుడగ ని తాకి ఏదో కదిలిస్తోందోన్న విషయం యముడికి తెలుస్తోంది. అది హఠాత్తున పగిలిపోయి ఆ ఖాళీ,  హృదయం లో సన్నటి బాధకి కేంద్రమవుతోందని అనుభవంలోకొస్తోంది.

మరో నిమిషం అక్కడే తచ్చాడి, వాహానారోధితుడై బ్రహ్మపురికేగాడు.

తనదగ్గిరకొచ్చిన యముణ్ణి చూసి, బ్రహ్మ భయాశ్చర్యానికి లోనయినా తేరుకొని యముని వంక అనుమానంగా చూసాడు. అలనాడు యముడికిచ్చిన వరం గుర్తొచ్చింది. యమపాశానికి తిరుగు లేదనీ, ఒకసారి ప్రయోగించాక విఫలమవదనీ తనిచ్చిన మాట గుర్తొచ్చింది. రాకూడని చోటకి యముడెందుకు వచ్చాడా అని సాలోచనగా చూసాడు.

ఆతృత తో వచ్చిన యముడు, ఆలస్యం చేయకుండా తన విన్నపాన్ని మొదలుపెట్టాడు.

“కమలసంభవా, కర్తవ్యబద్దంగా నిరంతర భూలోక ప్రయాణీకున్నయిన నాకు, ఎన్నడూ నీ ముంగిటకి రావలసిన అవసరం కలగలేదు. కనుక నీ సృష్టి ఎలా జరుగుతుందో నాకు తెలియదు. నిరూప, నిర్గుణ, నిర్యాద్యంత లోకాల్లో కాలం లేని శూన్యం లోంచి, మానవ రూపాన్ని సృష్టించి, ప్రాణాన్ని పోసి, తనకి కాలాన్ని ఆరంభం చేసి భూమ్మీదకి పంపే నీ సృష్టి ప్రక్రియని నేనెప్పుడూ గాంచలేదు.

నేను అంతిమధర్మ అమలుకర్తననీ, పక్షపాత,రాగద్వేషాలకతీత బాధ్యతలు కలవాణ్ణనీ, కించిత్తు కర్తవ్యలోపమైనా సరే, సమస్తలోక సమతుల్యతని దెబ్బతీస్తుందన్న సత్యభారంతో, యుగాలుగా నిర్వికారంగా నా పాశంతో ప్రాణాన్నాపి, నీ మానవుణ్ణి నిర్జీవిని చేస్తూ వస్తూన్న నేను, మొదటిసారిగా సృష్టి ఎలా జరుగుతుందో చూసాను .  జీవం బయటకి రావటం తెలిసిన నేను, జీవకళ రాయి లోపలకి ఎలా వెళ్తుందో చూసాను. చివరి తాకిడి పిదప ఉలి పక్కన పెట్టిన శిల్పి, కళ్ళారా తన సృష్టిని చూసి కళ్ళూ, హృదయం నింపుకోవడం చూసాను.

ఓ చతుర్ముఖా, యుగాంతమెరుగని నేను, మానవులకి వారి అంతిమగమ్యం గా సుపరిచతమయ్యాను. అనంతంగా, వినాశ ధర్మ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మానవులకి దుఖాన్నిస్తున్న నాకు, ఒక్కసారి నా ఈ స్థానంలోంచి , నీ స్థానంలోకి రావాలనుంది. అనంత ప్రాణికోటి మృత్యానంతర శూన్యాన్ని మనుషుల మీదకి వంతులవారీగా పంచుతూ పోయే నేను, ఆ నిరంతర నిర్వికారపు స్థితి స్థానంలో, నీ సృజన క్రియ మాధుర్యాన్నీ, కొత్తసృష్టిని కలిగించటంలో జనించే అమృతానందాన్ని ఒక్కసారయినా అనుభవించాలనుంది అబ్జజా”, అన్నాడు.

అది విన్న వాణీవిభుడు ఆశ్చర్యపోయాడు. అంతం ఆది అవాలనుకుంటోందా? ప్రళయకాల సంకేతమేమీ కాదు కదా ఇది? అని ఆలోచించాడు. యుగాలుగా జరుగుతోన్న మానవలోక సంపర్కం మానవీయ రాగద్వేషాల వైపు యముణ్ణి నెడుతోందనీ, దుఖకారకుణ్ణన్న స్పృహ యముణ్ణి ప్రభావితం చేస్తోందనీ, తను మానవదుఖశాపగ్రస్తుడవుతున్నాడనీ బ్రహ్మ గ్రహించాడు. వృత్తాకారంలో మృత్యుప్రాణాలొకదానివెంట మరొకటి నిరంతరంగా పరిభ్రమిస్తూ ఏర్పరిచే సమతూకం లోంచి తను సడలిపోతే జరిగే ప్రమాదం బ్రహ్మ ముందు కదలాడింది. యమధర్మరాజు కోరికని కొద్దికాలం కోసమయినా తీర్చి, తనలో ఉత్తేజాన్నినింపి, తిరిగి కర్తవ్యమార్గంలో పెట్టాల్సిన భాద్యత తనమీద ఉందని అనుకున్నాడు.

చిన్నగా నవ్వి, “ఓ సూర్యపుత్రా, సమసమాజ సమానత్వం అంటూ ఆర్తి పడే మానవజాతికి అంతిమ సమానత్వాన్ని అందించే భాద్యతని నిర్వర్తిస్తున్న ఏకైక దేవదేవుడివి, నీవిలా దిగాలు పడటం భావ్యమా?! అయినప్పటికినీ నీ కోరిక సమంజసమే అన్న భావన కలుగుతోంది. ఈ క్షణమే నిన్ను నా స్థానంలో కూర్చోపెడుతున్నాను.

నీలో సంవేదనని పరాకాష్టకి చేర్చి, ఈ కోరికని ఉధ్బవించేలా చేసిన శిల్పిని చూడాలన్న ఉత్సుకత నాలో మొదలయింది. నా సృష్టి చేసిన సృష్టి, నిన్ను మరో సృష్టి చేయడానికి ప్రేరేపించిందా?! భళా! వెనువెంటనే భూగ్రహవాసానికి వెళ్తాను”

అని మానవమరణానంతర ధర్మకర్తని, తాత్కాలికంగా మానవజన్మారంభపు సృష్టికర్తగా చేసి, బ్రహ్మ మానవావతరం ధరించి భూమ్మీదికొచ్చాడు.

యముణ్ని కదిలించిన శిల్పినీ, తన నైపుణ్యాన్నీ , తన సృష్టినే తలదన్నేట్లున్న ఆ శిల్పాల్నీ చూసి అవాక్కయ్యాడు, అసూయ చెందాడు, కించిత్తు స్వీయావమానభారాన్ననుభవించాడు.

ఔరా, నా చేతుల్లోంచి జారిన మనిషి, చివరకి నా స్థానాన్నే జార్చేసాడే!. సాక్షాత్తూ బ్రహ్మని అయిన నేను, తలచుకుంటే ఈ శిల్పి శిల్పకళని దిగదుడిచేలా, రాబోయే అనంత కాలంలో అనేకసార్లు రాబోయే యముడు అబ్బురంతో ఆనందపడేలా, మరింకో సారి మరే ఇతర మానవుడి శిల్పకళకీ మైమరపు చెంది కర్తవ్యం మరవకుండా ఉండేలా, అంతే కాదు సమస్త దైవలోకం సైతం అచ్చెరువొంది వారి వారి విశ్రాంత వేళల ధరణీవిహార సందర్శనా స్థలం లా, మానవ లోకం మలుపు తిరిగేలా సృష్టించటం నాకు చిటికెలో పని కదూ !
అని తలంచిన పద్మోద్భభవుడు, రాతిని చేతుల్లోకి తీసుకోని రెండు చేతులతో మర్ధించి, మైనం లా చేసి, చేతివేళ్లతో చెట్టువేరుల్నిరప్పించి, అందులోంచి ఆకుల్ని పుట్టించి, ఆకుల్లో కాండాల్నీ , అందులోంచి లతల్నీ, ఆ లతలు అల్లుకున్న మానవ దేహంలో నాడీ మండలాల్ని సృష్టించి, దాని చుట్టూ ఉన్న వంపుల్లో మాంసాన్ని కూర్చి, కళ్ళల్లో భావావేశాల్నీ, చెక్కిట కన్నీటి చుక్కల్నీ అలవోకగా అమర్చి, "అపోలో అండ్ డాఫ్నే" యే కాక, మరెన్నో సజీవ రూపాల శిల్పకళతో ఆ ఆదిశిల్పి  మానవలోక మనోలోకాన్ని నిబిడాశ్చర్యంతో స్థంభింపచేసాడు.

మానవ రూపంలో ఉన్న ఆ బ్రహ్మనే , ఆ లోకం బర్నీని అని పిలుచుకుంది.

***

కానీ, అమరత్వమెరుగని నేలపైనున్న లలాటలిఖితుడికి ఆ విష్ణుమాయ తప్పలేదు. సృష్టికార్యతృప్తిఫలాల్ని యమధర్మరాజు కి అందించాలనుకొని, తన లోకాన్నీ, స్థలకాలాంతారస్థానాన్నీ త్యాగం చేసొచ్చి మానవాకారాన్ని ధరించిన విధాత కి, అనివార్యమయిన మానవజన్మ దు:ఖం ఎదురయింది.

జన్మనిచ్చానే కానీ, ప్రాణమివ్వలేకపోయానే అని కుమిలిపోయిన బ్రహ్మ దు:ఖం తో, సమస్త మానవజాతి ఏకమయింది.
***
Below: Rape of Persephone by Bernini
(Pictures taken from Google Images)

0 comments:

Post a Comment